సీమాంతర ఉగ్రవాదం ఉండేవరకు సింధు ఒప్పందం నిలిపివేత

సీమాంతర ఉగ్రవాదం ఉండేవరకు సింధు ఒప్పందం నిలిపివేత
సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్థాన్‌ మద్దతు నిలిపివేసే వరకు సింధూ జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని భారత్ స్పష్టం చేసింది. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పరిస్థితులపై మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్థాన్ పర్యవసానాలను ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. భారత్‌తోపాటు ప్రపంచ దేశాల్లోని అమాయకులను పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు బలితీసుకున్నారని మండిపడ్డారు.

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ పరిష్కారానికి ద్వైపాక్షిక చర్చలే మార్గమని పునరుద్ఘాటించారు. జమ్ముకశ్మీర్‌ విషయంలో భారత్‌ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. ద్వైపాక్షిక చర్చలు తప్ప ఎలాంటి మధ్యవర్తిత్వాన్ని భారత్‌ అంగీకరించదని తెగేసి చెప్పారు. పీవోకేను పాకిస్థాన్‌ ఖాళీచేసే అంశం మాత్రమే మిగిలి ఉందని పేర్కొన్నారు. కాల్పుల విరమణపై తమ వైఖరి సుస్పష్టమని, ప్రపంచ దేశాల నుంచి తమతో సంప్రదింపులు జరిపిన వారందరితోనూ ఇదే విషయాన్ని చెప్పామని జైశ్వాల్ తెలిపారు. 

ఉగ్రవాదులను అణచివేయడమే భారత్‌ ప్రాథమిక లక్ష్యమన్నారు. పాక్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ దాడిచేస్తే, ప్రతిగా పాకిస్థాన్‌ దుస్సాహసానికి దిగిందని చెప్పారు. అందుకు ప్రతిచర్యగానే భారత్‌ పాకిస్థాన్‌పై దాడులు చేసిందని వివరించారు. పాకిస్థాన్‌ కాల్పులు నిలిపివేస్తే భారత్‌ దాడులు ఆపేస్తుందని, వాళ్లు కవ్విస్తే తాము అంతకు రెండింతలు దెబ్బకొడుతామని, ఇదే విషయాన్ని తాము ప్రపంచ దేశాలకు స్పష్టం చేశామని రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ తెలిపారు.

“పీవోకే సమస్య పరిష్కారానికి ద్వైపాక్షిక చర్చలే మార్గం. జమ్ముకశ్మీర్‌ విషయంలో భారత్‌ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. ద్వైపాక్షిక చర్చలు తప్ప ఎలాంటి మధ్యవర్తిత్వాన్ని భారత్‌ అంగీకరించదు. పీఓకేను పాక్‌ ఖాళీ చేసే అంశం మాత్రమే మిగిలి ఉంది” అని జైస్వాల్ స్పష్టం చేశారు.

“ఉగ్రవాదాన్ని పరిశ్రమలా పెంచిపోషిస్తున్న పాక్‌ పునరాలోచించాలి. ఉగ్రవాదాన్ని పెంచిపోషించిన ఫలితాలను పాక్‌ అనుభవించక తప్పదు. ఉగ్రవాదం అన్ని దేశాల్లోని అమాయకులను బలితీసుకుంది. ఉగ్రవాదంపై చర్చలకు కొత్త ప్రమాణాలు ఏర్పడ్డాయి” అని హెచ్చరించారు. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత మారిన పరిస్థితులకు అనుగుణంగానే చర్చలు జరిగాయని జైస్వాల్ తేల్చి చెప్పారు. 

“ముజఫరాబాద్‌, బహావల్‌పూర్‌, మురిద్కేల్లో ఉగ్రస్థావరాలు నేలమట్టం చేశాం. పాక్‌ సైనిక సామర్థ్యాన్ని భారత్‌ నిర్వీర్యం చేసింది. పాక్‌లోని ప్రధాన వైమానిక స్థావరాలను వాడలేని పరిస్థితి కల్పించాం. పాక్‌ ఈ వైఫల్యాలను విజయాలుగా చెప్పాలనుకుంటే స్వాగతిస్తున్నాం. కాల్పుల విరమణకు ఎవరు ఎవరికి ఫోన్‌ చేశారనేది ప్రపంచం గుర్తించింది. ఈ నెల 9 రాత్రి వరకు భారీగా దాడులు చేస్తామని పాక్‌ బెదిరించింది” అని రణ్ధీర్ జైస్వాల్ వివరించారు.