అఫ్గానిస్థాన్ లో చెస్ పై తాలిబన్ల నిషేధం

అఫ్గానిస్థాన్ లో చెస్ పై తాలిబన్ల నిషేధం

తమ దేశంలో చెస్ను నిషేధిస్తున్నట్లు  అఫ్గానిస్థాన్ లోని తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. మతపరమైన కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. తొలుత మే 11న చెస్ గేమ్ ను నిలిపివేస్తున్నట్లు యంత్రాంగం తెలిపింది. ఆ తర్వాత ఆటపై ఏకంగా నిషేధం విధిస్తున్నట్టు వెల్లడించింది. ఇస్లామిక్ చట్టం ప్రకారం ఈ ఆటపై నిషేధం విధిస్తున్నట్టు పేర్కొంది. 

ఈ సమస్యను పరిష్కరించే వరకూ చెస్ పై నిషేధం కొనసాగుతుందని చెప్పింది. తాలిబన్లు అఫ్గానిస్థాన్ లో అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుంచి సాంస్కృతిక, సామాజిక, క్రీడా కార్యక్రమాలపై ఆంక్షలు విధిస్తూన్నారు. ఈ నేపథ్యంలో చెస్పై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతకంటే ముందు చెస్ను కొనసాగించాలని క్రీడా మంత్రిత్వ శాఖను కొంతమంది క్రీడాకారులు కోరారు. 

అయితే అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారి ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఒకప్పుడు అఫ్గానిస్థాన్ లో చెస్ మేధో క్రీడగా పరిగణించేవారు. ఇటీవల కాలంలో చెస్ ఆడేవారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. అయితే తాలిబన్ ప్రభుత్వం సాంస్కృతిక, వినోద కార్యకలాపాలను పరిమితం చేయడానికే నిషేధ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల తాలిబన్లు ప్రకటించిన కొత్త యూనిఫామ్ మార్చి 22 నుంచి విద్యార్థులు ధరించాలని ఆదేశించారు. ఈ నిర్ణయం ఫిబ్రవరి 27న ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రకటన ప్రకారం, 1 నుంచి 9 తరగతుల విద్యార్థులు నీలి రంగు దుస్తులు, తెల్ల టోపీ ధరించాలని పేర్కొన్నారు. 10 నుంచి 12వ తరగతి విద్యార్థులు తెల్ల దుస్తులు,టోపీ లేదా తలపాగా ధరించాలని తెలిపారు.

గతంలో తాలిబన్ నాయకుడు హిబతుల్లా అఖుంద్జాదా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల యూనిఫామ్‌లపై నిర్ణయం తీసుకున్నారు. బాలికలకు నలుపు రంగు యూనిఫాం ఉండాలని ఆదేశించారు. యూనిఫాం విషయాన్ని పేర్కొంటూ తొమ్మిది పాయింట్ల నివేదిక రూపొందించారు. అందులో మహిళా ఉపాధ్యాయనుల యూనిఫాంకు సంబంధించిన వివరాలను చేర్చలేదు.

తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలపై కూడా అనేక ఆంక్షలను విధించారు. వీరు అఫ్గానిస్థాన్ లో అధికారాన్ని చేజిక్కించుకునే ప్పటి నుంచి బాలికలు ఆరో తరగతి కంటే ఎక్కువ చదువుకోకుండా నిషేధించారు. విశ్వవిద్యాలయాలు, వైద్య, విద్యా కేంద్రాలలో మహిళలు చదవకూడదని ఆజ్ఞలు జారీ చేశారు.