కాల్పుల విరమణకు, వాణిజ్యానికి సంబంధం లేదు

కాల్పుల విరమణకు, వాణిజ్యానికి సంబంధం లేదు
 
* ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన భారత్
 

వాణిజ్యాన్ని ఉపయోగించి భారత్‌-పాకిస్థాన్‌ మధ్య యుద్ధాన్ని నివారించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను భారత్ తిప్పికొట్టింది. కాల్పుల విరమణకు, వాణిజ్యానికి సంబంధం లేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో అమెరికా ప్రతినిధులతో భారత ప్రతినిధులు ఫోన్​లో మాట్లాడారని, ఆ సమయంలో వాణిజ్యం గురించి ఎలాంటి ప్రస్తావన రాలేదని తెలిపాయి

“ఆపరేషన్ సిందూర్​ గురించి ప్రధాని మోదీ, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ల​తో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో విడతల వారీగా చర్చలు జరిపారు. మే 9న ప్రధాని మోదీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్​తో మాట్లాడారు. ఆపరేషన్​ సింధూర్ ప్రకటన తర్వాత ప్రధాని మోదీతో జేడీ వాన్స్​ ఫోన్​లో మాట్లాడారు” అని తెలిపారు. 

“అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మే 8,10వ తేదీల్లో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ మాట్లాడారు. అదేవిధంగా మే 10న అజిత్‌ డోభాల్‌తోనూ మాట్లాడారు. అయితే ఈ చర్చల్లో ఎక్కడ కూడా ఇరుదేశాల మధ్య వాణిజ్య అంశం ప్రస్తావనకు రాలేదు. కాల్పుల విరమణకు, వాణిజ్యానికి సంబంధం లేదు” అని అధికార వర్గాలు తేల్చి చెప్పాయి. 

అంతకుముందు కూడా కాల్పుల విరమణపై ట్రంప్ తొలుత ప్రకటన చేశారు. అప్పుడు కూడా భారత్​ ఏ మాత్రం ట్రంప్ పాత్రను ప్రస్తావించలేదు. భారత్‌- పాక్‌ల మధ్య కాల్పుల విరమణకు తమ యంత్రాంగం మధ్యవర్తిత్వం వహించిందని ట్రంప్ పేర్కొన్నారు. అనేక అణ్వాయుధాలను కలిగి ఉన్న రెండు దేశాల మధ్య ప్రమాదకర పోరాటం జరుగుతున్న సమయంలో అమెరికా యంత్రాంగం జోక్యం చేసుకుని యుద్ధాన్ని నివారించిందని ట్రంప్‌ వివరించారు.

కాగా, రెండు దేశాలతో వాణిజ్యం నిలిపివేస్తానని బెదిరించి భారత్‌, పాకిస్థాన్‌ను కాల్పుల విరమణకు ఒప్పించానని ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించేందుకు కొద్దిసేపు ముందు ట్రంప్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. “ఇక యుద్ధం ఆపెయ్యండి. మీరు ఆపేస్తే మనం వాణిజ్యం చేద్దాం. మీరు ఆపకపోతే మాతో ఇక మీరు ఎటువంటి వాణిజ్యం చేయలేరు” అని భారత్‌, పాక్‌ను బెదిరించానని ట్రంప్‌ తెలిపారు. 

హఠాత్తుగా ఆ రెండు దేశాలు కూడా తాము కూడా యుద్ధం ఆపేయాలని ఆలోచిస్తున్నట్టు చెప్పాయని పేర్కొంటూ ఆ రెండు దేశాల నిర్ణయాలపై వాణిజ్యం బలమైన ప్రభావం చూపిందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే, ఈ వాఖ్యాలను భారత్ ఖండించింది. కాల్పుల విరమణ జరగగానే పాకిస్థాన్ ట్రంప్ కు కృతజ్ఞతలు తెలపగా, భారత్ ఆయన పేరును ఎక్కడా ప్రస్తావించని లేదు. ప్రధాని మోదీ ప్రసంగంలో ఎక్కడ కూడా ట్రంప్ ప్రస్తావన రాలేదు.

అయితే, “చాలా కారణాలు ఉండొచ్చు. కాని అందులో వాణిజ్యం చాలా ముఖ్యమైనది” అని ట్రంప్‌ పేర్కొన్నారు తాను జోక్యం చేసుకున్నందువల్లే రెండు దేశాల మధ్య అణు యుద్ధం తప్పిందని తాను భావిస్తున్నట్టు ఆయన వ్యాఖ్యానించారు. పైగా, “అణు యుద్ధాన్ని మేము ఆపాం. అదో ఘోరమైన అణు యుద్ధం అయ్యేదని నేను భావిస్తున్నాను. లక్షలాది ప్రజలు మరణించి ఉండేవారు” అంటూ ట్రంప్‌ తెలిపారు. 

 
భారత్‌, పాక్‌తో అమెరికా పెద్ద ఎత్తున వాణిజ్యం చేస్తుందని ఈ సందర్భంగా ట్రంప్ స్పష్టం చేశారు. భారత్‌తో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే పాకిస్థాన్‌తో కూడా చర్చలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు.