90 రోజుల పాటు అమెరికా, చైనా సుంకాల తగ్గింపు

90 రోజుల పాటు అమెరికా, చైనా సుంకాల తగ్గింపు
అగ్రరాజ్యం అమెరికా, చైనాల మధ్య కీలక వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇరుదేశాలు సుంకాలను భారీగా తగ్గించేందుకు సోమవారం ఓ అంగీకారానికి వచ్చాయి. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా దిగుమతులపై చైనా సుంకాలను 125 నుంచి 10 శాతానికి తగ్గించింది. మరోవైపు చైనా దిగుమతులపై అమెరికా సుంకాలను 145 నుంచి 30 శాతానికి తగ్గించింది. ఈ తగ్గింపు 90 రోజులు మాత్రమే అమల్లో ఉండేలా ఇరు దేశాలూ ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ఇరు దేశాల మధ్య స్విట్జర్లాండ్‌ వేదికగా జరిగిన వాణిజ్య చర్చల్లో భాగంగా నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు ఇరు దేశాలు పరస్పర ప్రతీకార సుంకాల ప్రకటనలతో ప్రపంచ దేశాలకు, స్టాక్ మార్కెట్లకు కంటిమీద కునుకులేకుండా చేశాయి. వివిధ భాగస్వామ్య దేశాలపై ప్రతీకార సుంకాల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాపై భారీగా సుంకాలు విధించారు. ప్రతిగా ఆ దేశం కూడా అమెరికాపై టారిఫ్‌ వార్‌కు దిగింది.

గత మార్చి వరకు చైనా వస్తువులపై అమెరికా 10 శాతం సుంకాన్ని విధించింది. ఇటీవల పెంచిన పన్నుతో ఇది 54 శాతానికి చేరుకున్నది. దీనిపై డ్రాగన్‌ దీటుగా స్పందించింది. ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34 శాతం అదనపు సుంకం విధించాలని నిర్ణయించింది. దీనిపై ఆగ్రహించిన ట్రంప్‌ టారిఫ్‌ల విషయంలో వెనక్కి తగ్గాలంటూ డ్రాగన్‌ను హెచ్చరించారు. 

పైగా, మరో 50 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో టారిఫ్‌లు 104 శాతానికి చేరాయి. అయినా చైనా వెనక్కి తగ్గలేదు. అమెరికాపై 84 శాతం టారిఫ్‌ విధిస్తున్నట్లు ప్రకటించింది. ట్రంప్‌ హెచ్చరికలను చైనా పెడచెవిన పెట్టడంతో మళ్లీ అదనపు సుంకాల పోటు తప్పలేదు. చైనా నిర్ణయంతో ట్రంప్‌ మరో 21 శాతం బాదారు. దీంతో చైనాపై ప్రతీకార సుంకాలు 125 శాతానికి చేరింది. 

టక ఫెంటానిల్‌ అక్రమ రవాణాలో చైనా పాత్ర ఉందన్న ఆరోపణలకుగాను ప్రత్యేకంగా 20 శాతం సుంకాలు విధించడంతో మొత్తం టారిఫ్‌లు 145 శాతానికి చేరింది. ఇక చైనా సైతం అమెరికాపై 125 శాతం సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా రెండు దేశాలు సుంకాలు తగ్గించేందుకు అంగీకారం కుదుర్చుకున్నాయి.