
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ సైనిక దాడులను భారత్ ధీటుగా ఎదుర్కొన్నదని భారత త్రివిధ దళాల అధికారులు తెలిపారు. ఈ క్రమంలో పాకిస్థాన్కు చెందిన కొన్ని ఆధునిక ఫైటర్ జెట్లను కూల్చివేసినట్లు చెప్పారు. పాక్ దాడుల్లో ఐదుగురు సైనికులను కోల్పోయినట్లు వివరించారు. పదుల సంఖ్యలో పౌరులకు ప్రాణ నష్టం జరిగిందని పేర్కొన్నారు.
మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, ఎయిర్ మార్షల్ ఏకే భారతి, వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. పాకిస్థాన్ ఆక్రమిత జమ్ముకశ్మీర్ (పీవోకే)తోపాటు పాకిస్థాన్లోని 9 ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడి కోసమే మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రారంభించినట్లు చెప్పారు. కేవలం ఉగ్రవాద స్థావరాలనే ధ్వంసం చేశామని స్పష్టం చేశారు.
పాక్ సైనిక స్థావరాలతోపాటు పౌరుల జోలికి వెళ్లలేదని స్పష్టం చేశారు. ఉగ్రవాద స్థావరాల ధ్వంసంలో అనుకున్న లక్ష్యాలను సాధించినట్లు ఆధారాలతో సహా వివరించారు. వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యాయరని వెల్లడించారు. కాగా, ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ సైన్యం దాడులను ఉదృతం చేసిందని భారత త్రివిధ దళాల అధికారులు తెలిపారు.
డ్రోన్లు, యూవీలతో దాడులతో పాటు సరిహద్దుల్లో కాల్పుల తీవ్రత పెరిగిందని చెప్పారు. దీంతో ధీటుగా సమాధానం ఇచ్చామని, ఎయిర్ డిఫెన్స్తో డ్రోన్సు, యూవీలను కూల్చివేసినట్లు తెలిపారు. మరోవైపు సరిహద్దులో ఉద్రిక్తతలు రెచ్చగొట్టవద్దన్న సందేశం ఇచ్చేందుకు పాకిస్థాన్ సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు త్రివిధ దళాల అధికారులు తెలిపారు.
పాక్ ఎయిర్ బేస్లకు భారీ నష్టం కలిగించినట్లు చెప్పారు. ఎఫ్ 16 వైమానిక స్థావరాలు, శిక్షణా కేంద్రాలు, వైమానిక రక్షణ విభాగాలు, కమాండ్ హబ్లను విజయవంతంగా లక్ష్యంగా చేసుకుని ఖచ్చితమైన దాడులు జరిగాయని ధృవీకరించారు. పాకిస్థాన్కు చెందిన కొన్ని ఆధునిక ఫైటర్ జెట్లను కూల్చివేశామని పేర్కొన్నారు.
భారత భూభాగంపైకి రాకుండా వాటిని అడ్డుకుకోవడంతో శిథిలాల ఆధారాలు మన వద్ద లేవని, అలాగే సుమారు 40 మంది పాక్ సైనికులు మరణించి ఉంటారని అంచనా వేశారు. కాగా, పాక్ దాడుల్లో భారత్ సైనిక స్థావరాలకు ఎలాంటి నష్టం జరుగలేదని త్రివిధ దళాల అధికారులు తెలిపారు. పాక్ కాల్పుల్లో ఐదుగురు సైనికులను కోల్పోయినట్లు చెప్పారు. బాధిత సైనిక కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
పాకిస్థాన్ భారత పౌరులను లక్ష్యంగా చేసుకున్నదని ఆరోపించారు. దీంతో పదుల సంఖ్యలో పౌరులకు ప్రాణ నష్టం జరిగిందని వివరించారు. బాధిత కుటుంబాలకు కలిగిన లోటు తీర్చలేనిదని విచారం వ్యక్తం చేశారు. మరోవైపు పాక్ డీజీఎంఏ వినతి మేరకే కాల్పుల విరమణకు అంగీకరించినట్లు మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ తెలిపారు.
అయినప్పటికీ ఈ నిబంధనను పాక్ ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. భారత్ ఎంతో సంయమనం పాటిస్తున్నదని చెప్పారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇరుదేశాల మిలిటరీ అధికారుల మధ్య చర్చలు జరుగుతాయని వివరించారు. భారత దేశ సౌరభౌమత్యాన్ని కాపాడం, దేశాన్ని రక్షించడంమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. పాక్ దాడులు జరిపితే భారత్ కూడా ప్రతిస్పందించడానికి వెనుకాడదని త్రివిధ దళాలు స్పష్టం చేశాయి. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని, ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేవరకు దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు. భారత ఎయిర్ డిఫెన్స్ బ్రహ్మాండంగా పనిచేసిందని అధికారులు తెలిపారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు