ట్రంప్ మధ్యవర్తిత్వం అవసరం లేదు

ట్రంప్ మధ్యవర్తిత్వం అవసరం లేదు

పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంశంపై మధ్యవర్తులు అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్‌కు అప్పగించడం మినహా పాకిస్థాన్‌కు మరో మార్గం లేదని ఆయన స్పష్టం చేశారు. కాశ్మీర్ అంశం పరిష్కరించుకునేందుకు తాము మధ్యవర్తిత్వం వహిస్తామని అమెరికా చెప్పిన వేళ ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరింప చేసుకున్నాయి. 

కాశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడూ ఒక్కటేనని మోదీ కుండబద్దలు కొట్టారు. కాశ్మీర్‌ విషయంలో ఇంతకుమించి మాట్లాడేదేమీ లేదని సుస్పష్టం చేశారు. ఉగ్రవాదులను అప్పగించే విషయంపై పాక్‌ మాట్లాడితే తామూ మాట్లాడతామని ప్రధాని మోదీ చెప్పారు. ఇక త్రివిధ దళాల అధిపతులకు మోదీ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా ముగిసిపోలేదని పేర్కొంటూ పాక్‌ దాడులకు దిగితే భారత్‌ సైతం ఎదురుదాడి చేస్తుందని ప్రధాని మోదీ హెచ్చరించారు.

పాక్ కాల్పులకు దిగితే గట్టిగా బదులివ్వండంటూ త్రివిధ దళాల అధిపతులకు ప్రధాని మోదీ సూచించారు. పాకిస్థాన్ బుల్లెట్లకు ఫిరంగులతో సమాధానం ఇవ్వాలని భారత సైన్యాన్ని ప్రధాని ఆదేశించారు. పాకిస్థాన్ ప్రతీ చర్యకు భారత్‌ నుంచి బలమైన ప్రతిస్పందన ఉండాలని సాయుధ దళాలకు సూచించారు.

ఆపరేషన్ సింధూర్‌తో ప్రపంచానికి కొత్త సందేశం పంపామని చెప్పారు. ఉగ్ర శిబిరాల సహా హెడ్ క్వార్టర్స్‌ను ధ్వంసం చేశామని గుర్తు చేశారు. వైమానిక దాడుల తర్వాత పాకిస్థాన్ చేతులెత్తేసిందని ఆయన పేర్కొన్నారు. సింధూ జలాల ఒప్పందాన్ని సీమాంతర ఉగ్రవాదంతో ముడిపెట్టామని, ఉగ్రదాడులు ఆగే వరకు ఒప్పందం నిలుపుదలలోనే ఉంటుందని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు.

కాగా, పాకిస్థాన్​లోని ఉగ్రవాదులపై దాడి చేసి తీరుతామని, దానిపై ఎలాంటి సందేహమూ అక్కర్లేదని మే 1న అమెరికా విదేశాంగ మార్కో రూబియోకు భారత విదేశాంగ మంత్రి జై శంకర్ చెప్పినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. ‘ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదులతో పాకిస్తాన్‌కు ఉన్న లింకులపై సరికొత్త ఆధారాలతో ఒక టీమ్‌ను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి భారత్ పంపనుంది. వచ్చే వారం యూఎన్ఎస్‌సీఆర్ 1267 ఆంక్షల కమిటీ సమావేశమై ఈ ఆధారాలను పరిశీలించనుంది’ అని భారత ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి.