ఇకపై ఏ ఉగ్రచర్య జరిగినా యుద్ధంగానే పరిగణిస్తాం

ఇకపై ఏ ఉగ్రచర్య జరిగినా యుద్ధంగానే పరిగణిస్తాం
భారత్‌- పాకిస్థాన్‌  దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగే ముందుగా భారత్‌ ఉగ్రవాదులకు, ఉగ్రవాదులకు మద్దతు పలుకుతున్న వారికి గట్టి హెచ్చరిక ఇచ్చిందని కేంద్ర ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక నుంచి దేశంలో ఎలాంటి ఉగ్రవాద దాడి జరిగినా దానిని భారత్‌పై యుద్ధంగానే పరిగణిస్తామని, అందుకు ధీటుగా బదులిస్తామని స్పష్టం చేసిందని వెల్లడించాయి.

పాకిస్థాన్ లేదా ఏ ఇతర దేశం, ఏ శక్తి నుంచి ఉగ్రవాద దాడులు జరిగినా , హింసాత్మక చర్యలు తలెత్తినా వీటిని భారతదేశం యుద్ధ నేర చర్యగా పరిగణిస్తుంది. ఈ మేరకు ఎటువంటి కవ్వింపు చర్యలను యుద్ధంలో మాదిరిగానే తిప్పికొడుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం రాత్రి జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీనుకున్నారు. 

దీనికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, అజిత్ ధోవల్, సైనిక ఉన్నతాధికారులు హాజరయ్యారు. పాక్ చర్యలను ఈ సందర్భంగా కూలంకుషంగా సమీక్షించారని ఆ తర్వాత అధికార వర్గాలు తెలిపాయి. పహల్గాం ఉగ్రదాడి , ఆ తర్వాత పాక్ నుంచి తలెత్తిన కవ్వింపు చర్యల నేపథ్యంలో ఇక ఎటువంటి ఉగ్ర చర్యను అయినా యుద్ధంగానే పరిగణనలోకి తీసుకుని, వీటిని తిప్పికొట్టడం జరుగుతుందని, ఈ మేరకు తగు విధంగా సరైన ఏర్పాట్లు చేసుకుని తీరాలని ఈ భేటీలో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. 

భారతదేశంలోని వివిధ నగరాలు, కీలక ఆయుధ స్థావరాలు, ప్రత్యేకించి పౌర సముదాయాలపై పాకిస్థాన్ నుంచి సాగిన దాడులను ఈ ఉన్నత స్థాయి సమీక్షలో తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోడీ దేశంలో నెలకొని ఉన్న భద్రతా పరిస్థితిని సమీక్షించారు. సరిహద్దుల్లో భద్రత, సరిహద్దు రాష్ట్రాలలో నెలకొన్న ఉద్రిక్తతల గురించి సమీక్షించారు.

ఈ వైఖరి భారత్ భద్రతా వైఖరిలో గణనీయమైన మార్పును సూచిస్తుంది.  ఈ నిర్ణయం కఠినమైన, ప్రత్యక్ష ప్రతిస్పందన విధానాన్ని సూచిస్తుంది,  ఇటువంటి సంఘటనలను ఇకపై అంతర్గత భద్రతా సవాళ్లుగా మాత్రమే చూడబోమని, భారత దేశం నుండి బలమైన, నిర్ణయాత్మక ప్రతీకార ప్రతిస్పందన అవసరమని అధికారులు ధృవీకరిస్తున్నాను. రెండు దేశాలు తీవ్ర సైనిక సంఘర్షణలో నిమగ్నమై ఉన్న పాకిస్తాన్‌తో తీవ్రమైన శత్రుత్వాల మధ్య ఈ ప్రకటన వచ్చింది.

ఇప్పుడు జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో తీసుకున్న యుద్ధ చర్య లేదా యాక్ట్ ఆఫ్ వార్‌కు విసృత నేపథ్యం ఉంది . ఏదైనా దేశం పలు కారణాలు లేదా అకారణంగా ఇతర దేశాలపై సాయుధ బలగాల ద్వారా దాడికి దిగడం లేదా అతిక్రమణ చర్యలకు పాల్పడటాన్ని ఈ యాక్ట్ ఆఫ్ వార్‌గా పిలుస్తారు. ఇటువంటి హింసాత్మక , సామూహిక రీతి నష్టం కల్గించే దాడులు సాయుధ ఘర్షణ లేదా యుద్ధంగా పరిగణిస్తారు. ఇందుకు అనుగుణంగానే ప్రత్యర్థి దేశంపై తగు చర్యకు రంగం సిద్ధం చేసుకుంటారు. 

ఏ దేశం అయినా ఇతర దేశాల దుందుడుకు చర్యలలో యాక్ట్ ఆఫ్ వార్ మిళితం అయి ఉందని భావిస్తే , తగు రీతిలో దెబ్బకు దెబ్బను సైనిక చర్యను చేపట్టవచ్చు. పరస్పర ఘర్షణలతో కూడిన యుద్ధానికి తలపడవచ్చు. ఈ క్రమంలో ఇప్పుడు ఉగ్రవాద చర్యలు ఎటువంటివి జరిగినా వాటిని భారతదేశం ఈ యుద్ధ పరిధి నిర్వచనంలోకి చేర్చుకుని, ఎదురుదాడులు, అణచివేతలకు దిగేందుకు వీలుంటుంది.

యాక్ట్ ఆఫ్ వార్ పరిధిలోకి వచ్చే ఎటువంటి చర్యను అయినా అంతర్జాతీయ చట్టాలు, ఐరాస నిర్ధేశిత నిబంధనల పరిధిలో తగు విధంగా తిప్పికొట్టేందుకు అవసరం అయిన న్యాయసమ్మత హక్కు సంబంధిత దేశానికి ఉంటుంది.ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రతకు భంగకరం అయ్యే ఎటువంటి సైనిక చర్య లేదా దాడిని అయినా చెల్లనేరనిదిగా ఐక్యరాజ్య సమితి నియమ నిబంధనావళి సంబంధిత ఆర్టికల్ 2(4)లో నిర్ధేశించారు. భద్రతా మండలి రూపొందించిన చార్టర్ మేరకు ఏ దేశం అయినా తన ఆత్మరక్షణకు దాడికి దిగితే తప్పితే ఇతర సైనిక చర్య ఎటువంటిది అయినా, అది ఆయా దేశాల అవాంఛనీయ సంస్థలు లేదా సాయుధ బృందాల నుంచి జరిగే హింసాత్మక చర్య అయినా యుద్ధం పరిధిలోకి వస్తుంది. 

ఇటువంటి వాటిని బాధిత దేశం సరైన విధంగా న్యాయపరంగా తిప్పికొట్టేందుకు వీలేర్పడుతుంది. అయితే యాక్ట్ ఆఫ్ వార్ గురించి ఐరాస ఛార్టర్‌లో నిర్థిష్టంగా పూర్తి స్థాయి వివరణ లేదు. అయితే సైనిక చర్యలను తగు విధంగా తిప్పికొట్టే ఎటువంటి యాక్షన్‌ను అయినా ఐరాస సమర్థిస్తుందని తెలిపారు. ఈ పూర్వ నేపథ్యం దృష్టిలో పెట్టుకునే భారత ప్రభుత్వం ఇప్పుడు యాక్ట్ ఆఫ్ వార్ పరిధిలోనే ఉగ్రవాద చర్యలను పరిగణనలోకి తీసుకుని, తగు విధంగా స్పందించాలని నిర్ణయించింది. యుఎన్ ఛార్టర్‌ను తగు రక్షణ కవచంగా అంతకు మించిన లక్ష్మణ రేఖ ఇకపై చర్యలకు దిగాలని సంకల్పించారు.

భవిష్యత్తులో జరిగే ఏదైనా దురాక్రమణకు నిర్ణయాత్మకంగా ప్రతిస్పందించడం కొనసాగించాలని భారతదేశం ప్రతిజ్ఞ చేసింది. ఈ విధాన మార్పు రెండు దేశాల మధ్య కొనసాగుతున్న సంఘర్షణలో కీలకమైన మార్పును సూచిస్తుంది. నియంత్రణ రేఖ  వెంబడి అడపాదడపా కాల్పులు కొనసాగుతున్నందున, దౌత్య, సైనిక ఉద్రిక్తతలు పెరుగుతున్నందున, రెండు దేశాలు అధిక అప్రమత్తతతో ఉన్నాయి.