
రష్యా రాజధాని మాస్కో సహా పలు ప్రాంతాలపై సోమవారం రాత్రి ఉక్రెయిన్ 105కి పైగా డ్రోన్లతో విరుచుకుపడిందని అధికారులు మంగళవారం ప్రకటించారు. ఉక్రెయిన్ దాడులతో రష్యాలోని పలు విమానాశ్రయాల్లో రాకపోకలను పరిమితం చేసినట్లు తెలిపారు. సోమవారం అర్థరాత్రి 105కి పైగా డ్రోన్లు రష్యాను లక్ష్యంగా చేసుకున్నాయని రక్షణ శాఖ ప్రకటించింది.
మే 9న నిర్వహించనున్న రెండవ ప్రపంచ యుద్ధం విక్టరీ డే పరేడ్కు కొన్ని రోజుల ముందు ఈ దాడులు చోటుచేసుకున్నాయి. 80వ వార్షికోత్సవ వేడుకలకు రష్యా అధ్యక్షులు పుతిన్ సహా పలువురు ప్రపంచ నేతలు హాజరుకానున్నట్లు తెలిపింది. మాస్కోపై దూసుకువచ్చిన 19 డ్రోన్లను వైమానిక రక్షణ దళాలు కూల్చివేశాయని, నగర దక్షిణాన ఉన్న సూపర్ మార్కెట్, నివాస భవనాలపై శిథిలాలు పడ్డాయని మేయర్ సెర్గీ సోబ్యానిస్ టెలిగ్రామ్లో పేర్కొన్నారు.
ధ్వంసమైన సూపర్ మార్కెట్ కిటికీ, పొగబారిన నివాస భవనం దృశ్యాలను విడుదల చేశారు. మాస్కోలోని నాలుగు ప్రధాన విమానాశ్రయాలతో సహా డజనుకి పైగా విమానాశ్రయాల్లో ఫెడరల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఏజన్సీ ఆంక్షలు విధించినట్లు రష్యా మీడియా పేర్కొంది. వోల్గోగ్రాడ్ మరియు నిజ్నీ నోవ్గోరోడ్ సహా ఇతర నగరాల్లోని విమానాశ్రయాలు ప్రభావితమయ్యాయి.
వొరొనెజ్, పెన్జా ప్రాంతాలలో వరుసగా 18 మరియు 10 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు ఆప్రాంత గవర్నర్లు తెలిపారు. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. రిల్స్క్ నగరంలోని విద్యుత్ సబ్స్టేషన్పై దాడి జరిగిందని, ఇద్దరు యువకులు గాయపడ్డారని కుర్స్క్ ప్రాంత తాత్కాలిక గవర్నర్ తెలిపారు. రెండు ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయని, దీంతో ఈ ప్రాంతంలో విద్యుత్ను పూర్తిగా నిలిపివేశామని చెప్పారు.
More Stories
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్, స్విట్జర్లాండ్లకు భారత్ హెచ్చరిక
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా డ్రోన్లు కూల్చేసిన పోలాండ్