
* సుమారు 300 మంది ఉగ్రవాదులు హతం!
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రస్థావరాలపై భారత్ విరుచుకుపడింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. మిస్సైళ్లతో మొత్తం 9 పాక్ ఉగ్రస్థావరాలను వాయుసేన పూర్తిగా ధ్వంసం చేసింది. 4 జైషే మహ్మద్, 3 లష్కరే తోయిబా, 2 హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. 300 మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందినట్లు చెబుతున్నారు.
కోట్లి, బహవల్పూర్, మురిద్కే, ముజఫరాబాద్, చాక్ అమ్రు, గుల్పూర్, భీంబర్, సియాల్కోట్లో దాడులకు పాల్పడింది. మురిద్కేలోని లష్కరే తోయిబా, బహవల్పూర్లోని జైషే మహ్మద్ ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని మెరుపు దాడులు చేసింది. పాకిస్తాన్ తేరుకునేలోపే ఆపరేషన్ సిందూర్ను భారత సైన్యం విజయవంతంగా పూర్తి చేసింది. డ్రోన్లు, క్షిపణులతో భారత్ ఏయిర్ ఫోర్స్ విరుచుకుపడింది. ఉగ్రవాద శిబిరాల పైన పక్కా సమాచారంతో గురి పెట్టి మరీ సైన్యం క్షిపణులు ప్రయోగించింది.
ఒక్క సారిగా జరిగిన దాడుల్లో ఉగ్రవాదుల క్యాంపుల్లో శిక్షణ పొందుతున్న వారు మరణించారు. జైషే ఈ మహ్మద్, లష్కర్ తోయిబా అగ్రనేతలు సైత్ం హతం అయినట్లు తెలుస్తోంది. బహావల్పూర్లో 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడిలో హఫీజ్ సయీద్, మసూద్ అజార్ చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే, అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.
బహవల్పూర్లోని మసూద్ అజార్ ప్రధాన కార్యాలయాన్ని భారత్ సైన్యం లక్ష్యంగా చేసుకుంది. వీరి ప్రధాన కార్యాలయం, మదర్సా ధ్వంసమయ్యాయి. ఈ విషయాన్ని పాకిస్తాన్ మీడియా ధృవీకరించింది. ఈ దాడిలో 50 మంది జైషే ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో మురిడ్కేలోని లష్కరే రహస్య స్థావరాన్ని భారత్ ఆర్మీ ధ్వంసం చేసింది. ఈ దాడిలో లష్కరే, జైషే సంస్థలకు చెందిన చాలా మంది అగ్ర కమాండర్లు హతమయ్యారు. అయితే, ఈ దాడిలో మసూద్ అజార్, హఫీజ్ సయీద్ మరణం పైన అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ. లోపు ఉన్న ఉగ్రస్థావరాలను భారత సైన్యం టార్గెట్ చేసింది. ఈ పరిధిలోనే బహవల్పూర్లో జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం, మురిడ్కే, సాంబా ఎదురుగా సరిహద్దుకు 30 కి.మీ. దూరంలో లష్కరే తోయిబా క్యాంపు, సరిహద్దు నియంత్రణ రేఖ పూంఛ్ – రాజౌరీకి 35 కి.మీ. దూరంలో ఉన్న గుల్పూరు, పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్లోని తంగ్ధర్ సెక్టార్ లోపల 30 కి.మీ. పరిధిలో ఉన్న సవాయ్ లష్కరే క్యాంప్, జేఎం లాంచ్ప్యాడ్ బిలాల్ క్యాంప్ ఉన్నాయి.
రాజౌరీకి ఎదురుగా నియంత్రణ రేఖకు 15 కి.మీ. దూరంలో ఉన్న జేఎం లాంచ్ప్యాడ్ బిలాల్ క్యాంప్, రాజౌరీకి ఎదురుగా నియంత్రణ రేఖకు 10 కి.మీ. పరిధిలో ఉన్న బర్నలా క్యాంప్, సాంబా – కతువా ఎదురుగా అంతర్జాతీయ సరిహద్దుకు 8 కి.మీ. దూరంలో ఉన్న సర్జల్ క్యాంప్, అంతర్జాతీయ సరిహద్దుకు 15 కి.మీ. దూరంలో సియాల్ కోట్ సమీపంలో ఉన్న హెచ్ఎం శిక్షణా శిబిరం మెహమూనా క్యాంప్పై మెరుపుదాడులకు పాల్పడింది.
ఇక, ఈ మెరుపు దాడుల తరువాత పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ ప్రధాని ఈ దాడిని ధృవీకరించారు. భారతదేశం యుద్ధానికి కాలు దువ్విందని ఆయన అన్నారు. ప్రతీకారం తీర్చుకునే హక్కు మనకు ఉందంటూ, దీటుగా బదులిస్తామని ప్రకటించారు.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్