
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన అనంతపురం జిల్లా ఓబుళాపురం అక్రమ మైనింగ్ (ఓఎంసీ) కేసులో హైదరాబాద్ సీబీఐ కోర్టు తుది తీర్పు వెల్లడించింది. దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో ఐదుగురిని దోషులుగా తేల్చింది. ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఓఎంసీ కంపెనీ, బీవీ శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, వీడీ రాజగోపాల్, కె.మెఫజ్ అలీఖాన్ను దోషులుగా తేల్చింది. గాలి జనార్దన్ రెడ్డి సహా ఐదుగురికి ఏడేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది.
అలాగే ఒక లక్ష రూపాయల జరిమానా విధించింది. 2004-09 మధ్యలో గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి, అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందంలను నిర్దోషులుగా ప్రకటించింది. ఇక ఈ కేసు నుంచి ఐఏఎస్ శ్రీలక్ష్మీని 2022లోనే సీబీఐ కోర్టు డిశ్చార్జి చేసింది. ఓఎంసీ ఆక్రమణలు, అక్రమ మైనింగ్పై 2009లో నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.
2011లో మొదటి ఛార్జిషీట్ దాఖలు చేసింది. అనంతరం ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీ, గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు మెఫజ్ అలీఖాన్, అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిందితులుగా చేర్చింది. మొత్తంగా ఈ కేసులో 9 మందిని నిందితులుగా చేర్చింది.
ఏ1గా బీవీ శ్రీనివాసరెడ్డి, ఏ2గా గాలి జనార్దన్ రెడ్డి, ఏ3గా గనుల శాఖ అప్పటి డైరెక్టర్ వీడీ రాజగోపాల్, ఏ4గా ఓఎంసీ మైనింగ్ కంపెనీ, ఏ5గా లింగారెడ్డి, ఏ6 ఐఏఎస్ శ్రీలక్ష్మీ, ఏ7గా మెఫజ్ అలీఖాన్, ఏ8గా మాజీ ఐఏఎస్ కృపానందం, ఏ9గా సబితా ఇంద్రారెడ్డి పేర్లను చేర్చింది. ఈ కేసులో భాగంగా నాంపల్లి సీబీఐ కోర్టు 219 మంది సాక్షులను విచారించింది. 3400 పత్రాలను పరిశీలించింది.
దాదాపు 14 ఏళ్ల పాటు సుదీర్ఘంగా విచారించిన తర్వాత నాలుగు చార్జ్షీట్లను ఇప్పటికే సీబీఐ కోర్టు ముందు సీబీఐ అధికారులు సమర్పించారు. ఈ కేసులో ఐపీసీ 120బి రెడ్ విత్ 420, 409, 468, 471లతో పాటు కొంతమందిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13 (2) రెడ్ విత్ 13 (1)(డి)కింద సీబీఐ అధికారులు అభియోగాలు నమోదు చేశారు. సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకుని సీబీఐ విచారణలో అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఈరోజు సీబీఐ కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది.
ఓబులాపురం అక్రమ మైనింగ్పై 2009, డిసెంబర్ 7న సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. 2011లో మొదటి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. మొదటి ఛార్జ్షీట్లోనే ఏ1, ఏ2లుగా ఉన్న గాలి జానార్దన్ రెడ్డి, ఆయన సోదరుడు శ్రీనివాస్ రెడ్డి కలిసి అక్రమంగా ఓబులాపురం మైనింగ్స్ను తవ్వి వాటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నారని పేర్కొన్నారు. దీని ద్వారా దాదాపు రూ.844 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని ఆ ఛార్జ్షీట్లో పొందుపర్చారు.
ఈ కేసులో దాదాపు 219 మంది సాక్షులను న్యాయస్థానం ముందు ఉంచి వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. వారి ఇచ్చిన స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకుని ఈకేసులో చాలా అంశాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు డాక్యుమెంట్ ఎవిడేషన్ను కూడా న్యాయస్థానం ముందు పెట్టింది సీబీఐ. డాక్యుమెంట్ ఎవిడేషన్ కింది దాదాపు 3337 డాక్యుమెంట్లను కోర్టు ముందు ఉంచింది.
సాక్షుల స్టేట్మెంట్లు, డాక్యుమెంట్లను వెరిఫై చేసిన తర్వాత న్యాయస్థానం దోషులకు శిక్షను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే అప్పటి ప్రభుత్వంలో గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి మాత్రమే ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ కాలేదు. ఈ కేసులో మిగిలిన నిందితులంతా కూడా అరెస్టు అయి జైలుకు వెళ్లారు. ఈ కేసులో సబిత డిశ్చార్జ్ పిటిషన్ వేసినప్పటికీ కూడా ఈకేసులో ఈమె పాత్ర కీలకమని గతంలో డిశ్చార్జ్ పిటిషన్ను కొట్టివేసింది కోర్టు. అయితే ఈకేసులో సబిత, కృపానందరం పాత్ర లేదని, వారికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలను లేనందున వారిని నిర్దోషులుగా ప్రకటిస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది.
More Stories
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
అడ్డంకుల తొలగింపుకు చర్చలకు ట్రంప్, మోదీ సుముఖం!
రాహుల్ గాంధీ మలేసియా `విహార యాత్ర’పై దుమారం