బాగ్‌లిహార్‌ డ్యామ్‌ నుంచి నీరు నిలిపేసిన భారత్

బాగ్‌లిహార్‌ డ్యామ్‌ నుంచి నీరు నిలిపేసిన భారత్
* భారత నౌకలపై పాకిస్థాన్‌ ఓడరేవుల్లో నిషేధం

జమ్ముకశ్మీర్​లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌ను అన్ని వైపుల నుంచి భారత్‌ దిగ్బంధిస్తోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేసిన కేంద్ర ప్రభుత్వం, తాజాగా బాగ్‌లిహార్‌ ఆనకట్ట నుంచి దాయాది దేశానికి నీటి సరఫరాను నిలిపివేసింది. పొరుగు దేశాన్ని ఎండగట్టే చర్యల్లో ఇది రెండోదిగా చెప్పాలి. ఓ క్షిపణిని పరీక్షించిన నేపథ్యంలో ఆ విషయం బయటకు వచ్చింది.

నీటి ప్రవాహాన్ని ఆపేందుకు బాగ్​లిహార్​ డ్యామ్‌ స్లూయిస్‌ స్పిల్‌వేపై ఉన్న గేట్లను కిందకు దించేశారు. దీంతో పాక్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌కు ఇక్కడ నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. ఇది స్వల్పకాల చర్యగా అక్కడి అధికారి ఒకరు ప్రముఖ మీడియాకు వెల్లడించారు. దీంతో అవసరమైతే భారత్‌ కఠిన చర్యలు తీసుకోగలదని పాక్‌కు తెలియజేసినట్లైందని చెప్పారు.

బాగ్ లిహార్ డ్యామ్​ను 900 మెగావాట్ల జలవిద్యుత్తు ఉత్పత్తి నిమిత్తం చినాబ్‌ నదిపై 2008లో నిర్మించారు. డ్యామ్‌ పొడవు దాదాపు 145 మీటర్లు కాగా, సింధు జలాల ఒప్పందం కింద పాక్‌కు అత్యధిక వాటా నీళ్లు లభించిన నదుల్లో చినాబ్‌ కూడా ఒకటి. పంజాబ్‌ ప్రావిన్స్‌లో ఎక్కువగా పంటపొలాలు దీనిపై ఆధారపడి ఉన్నాయి. 

ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏప్రిల్‌ 26న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపేసింది. ఆ తర్వాత 29 నాటికే ఈ డ్యామ్‌ నుంచి పాకిస్థాన్‌కు వెళుతున్న జలాలు నిలిచిపోయినట్లు ఉపగ్రహ చిత్రాలు బయటకు వచ్చాయి. పాక్‌లోని సియాల్‌ కోట్‌ వద్దకు వచ్చేసరికి చినాబ్‌ పూర్తిగా ఎండిపోయింది. పాక్‌లోని పంజాబ్‌లో పత్తి, వరి సాగుకు ఈ నీరు చాలా ముఖ్యం. 

గత వారం జీలం నది వరద ప్రవాహం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను భయపెట్టింది. అక్కడి ముజఫరాబాద్‌ సమీపంలో గత వారం జీలం నదిలో నీటి మట్టం ఒక్కసారిగా కొన్ని అడుగులు పెరిగిపోయింది. దీంతో స్థానిక అధికారులు హట్టియాన్‌ బాలా అనే ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చింది.

కాగా, సింధూ నదీ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత్‌ ఆ నదిపై నిర్మించే ఎలాంటి కట్టడాన్నైనా ధ్వంసం చేస్తామని పాకిస్థాన్‌ రక్షణ శాఖ మంత్రి ఖవాజా మహ్మద్‌ ఆసిఫ్‌ హెచ్చరించారు. జియో న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘సింధూ నదిపై ఎలాంటి నిర్మాణం జరిగినా దాన్ని భారత దూకుడు చర్యగానే చూస్తాం’ అంటూ బెదిరింపులకు దిగారు. 

మరోవంక, పాకిస్థాన్‌ ప్రతీకార చర్యలలో భాగంగా భారత జెండా ఉన్న నౌకలు తమ ఓడరేవులను ఉపయోగించుకోవడంపై నిషేధం విధించింది. భారత్‌ నుంచి దిగుమతి చేసుకునే పలు వస్తువులపైనా నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. నౌకలు కూడా భారత్‌లోని రేవులకు వెళ్లడానికి వీల్లేదని ఉన్నతాధికారులు ఆంక్షల విధించారు. న్యూఢిల్లీతో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్‌ సముద్ర వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.