10 ఏళ్లలో భారత ఓడరేవుల సామర్థ్యం రెట్టింపు

10 ఏళ్లలో భారత ఓడరేవుల సామర్థ్యం రెట్టింపు
గడిచిన 10 ఏళ్లలో భారత ఓడరేవుల సామర్థ్యం రెట్టింపు అయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. పోర్టుల సామర్థ్యం గణనీయంగా మెరుగుపడిందని వివరించారు. నావికుల సంఖ్యలో ప్రపంచంలోని తొలి మూడు దేశాల్లో భారత్‌ ఒకటిగా నిలిచిందన్న ప్రధాని, టర్నరౌండ్ సమయం 30 శాతం తగ్గిందని తెలిపారు.  ఇంతకుముందు 75 శాతం భారత షిప్‌మెంట్ కార్యకలాపాలు విదేశీ ఓడరేవులలో నిర్వహించడం వల్ల దేశం చాలా ఆదాయాన్ని నష్టపోయిందని తెలిపారు.
తిరువనంతపురంలో రూ. 8,867 కోట్లతో నిర్మించిన విజిన్‌జ‌మ్ ఇంట‌ర్నేష‌న‌ల్ డీప్‌వాట‌ర్ మ‌ల్టీప‌ర్పోజ్ సీపోర్టును  ముఖ్యమంత్రి పినరయి విజయన్, కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌, పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ సమక్షంలో మోదీ ప్రారంభించారు. 

“జి20 శిఖరాగ్ర సమావేశంలోనే మేము భారత్‌-మధ్యప్రాచ్యం-యూరప్ కారిడార్‌పై అనేక పెద్దదేశాలతో ఒప్పందాలు చేసుకున్నాము. ఓడరేవులకు సంబంధించి కేరళ చాలా ముఖ్య స్థానంలో ఉంది. విజింజం ఓడరేవు నుంచి కేరళ కూడా పెద్ద ఎత్తున ప్రయోజనం పొందబోతోంది. మన దేశంలోని సముద్ర రంగాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో ప్రైవేట్ రంగం కీలక పాత్ర పోషిస్తుంది” అని ప్రధాని తెలిపారు.

అన్ని వాతావరణాలలో పనిచేసే ఓడరేవు అయిన విజింజం అంతర్జాతీయ ఓడరేవు శుక్రవారం భారత సముద్ర వాణిజ్య చరిత్రలో కొత్త చరిత్రను లిఖించనుంది. భారతదేశ సముద్ర రవాణాకు కీలకమైన కేంద్రంగా మారనున్నది. దేశంలో మొట్టమొదటి సెమీ ఆటోమేటెడ్ ఓడరేవు అయిన విజింజం ఓడరేవు ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాంకేతికంగా అధునాతనమైన ట్రాన్స్‌షిప్‌మెంట్ ఓడరేవులలో ఒకటిగా నిలిచింది.

ఇది నౌకల టర్న్‌అరౌండ్ సమయాన్ని తగ్గిస్తుంది. భారతదేశం పెద్ద కంటైనర్ ఓడలను నిర్వహించే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ ఓడరేవు అంతర్జాతీయ ఓడరేవులపై ఆధారపడటాన్ని కూడా తగ్గిస్తుందని భావిస్తున్నారు.  కేర‌ళ స‌ర్కారు ఈ ప్రాజెక్టును ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించింది. ప‌బ్లిక్-ప్రైవేటు భాగ‌స్వామ్యంతో దీన్ని నిర్మించారు. అదానీ పోర్ట్స్‌, స్పెష‌ల్ ఎక‌నామిక్ జోన్ భాగ‌స్వామ్యం ఉన్న‌ది.

ఈ క్రమంలోనే మాట్లాడిన ప్రధాని మోదీ, ప్రతిపక్ష పార్టీపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఈ ఫొటో చాలామందికి నిద్రలేకుండా చేస్తుందని కాంగ్రెస్‌ను ఉద్దేశించి శశిథరూర్‌, విజయన్‌ ముందే మోదీ వ్యాఖ్యానించారు.  ‘‘ఈ రోజు శశి థరూర్‌ ఇక్కడ ఉన్నారు. ఈ కార్యక్రమం కొందమందికి నిద్రలేని రాత్రిని మిగులుస్తుంది. సందేశం ఎక్కడి వెళ్లాలో అక్కడికి వెళ్లిపోయింది’’ అని మోదీ చమత్కరించారు. అంతర్జాతీయ వాణిజ్యం, షిప్పింగ్‌ల కోసం భారతదేశానికి ఈ ఓడరేవు కీలకమవుతుందని ప్రధాని తెలిపారు. దేశాభివృద్ధిలో పబ్లిక్‌ ప్రైవేటు భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించారు.

కాగా అంతకుముందు గురువారం రాత్రి కేరళ చేరుకున్న ప్రధానిని శశి థరూర్‌ వ్యక్తిగతంగా వెళ్లి స్వాగతించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ‘‘డిల్లీ ఎయిర్‌పోర్టులో విమానాల ఆలస్యంగా నడుస్తున్నప్పటికీ సమయానికి తిరువనంతపురం చేరుకోగలిగా. నా నియోజకవర్గానికి వచ్చిన ప్రధాని మోదీని సాదరంగా స్వాగతించా’’ అని థరూర్‌ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు.

అయితే, కాంగ్రెస్‌ అధినాయత్వంతో ఎంపీ శశి థరూర్‌ బంధం బీటలు వారుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా థరూర్‌ తన సొంత పార్టీపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ మధ్య ఓ కేంద్రమంత్రితో ఆయన సెల్ఫీ దిగడంతో థరూర్‌ పార్టీ మారనున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత భారత విదేశాంగ విధానాన్ని ప్రశంసిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ పరిణామాల వేళ థరూర్​ మోదీతో వేదిక పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది.