సోనియా, రాహుల్ లకు ఢిల్లీ కోర్టు నోటీసులు

సోనియా, రాహుల్ లకు ఢిల్లీ కోర్టు నోటీసులు

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ కోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన పీఎంఎల్ఏ కేసులో ఈడీ ఛార్జిషీట్‌ను రౌస్ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది.

చార్జిషీట్‌కు సంబంధించిన కేసును విచారించడానికి నిందితులైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా ఇతర నిందితులు కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు తదుపరి విచారణను ఈ నెల 8వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 2025 ఏప్రిల్ 9న మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్లు 3, 4 కింద చార్జిషీట్ దాఖలు చేసింది. 

ఈ కేసులో సోనియా గాంధీని ఏ1గా, రాహుల్ గాంధీని ఏ2గా ఈడీ చేర్చింది. కాంగ్రెస్ నాయకులు సామ్ పిట్రోడా, సుమన్ దూబే వంటి వారు కూడా నిందితులుగా ఉన్నారు. నేషనల్ హెరాల్డ్ అనేది 1938లో జవహర్‌లాల్ నెహ్రూ స్థాపించిన చారిత్రక వార్తాపత్రిక. యంగ్ ఇండియన్ లిమిటెడ్ (వైఐఎల్) ద్వారా ఏజేఎల్‌కు చెందిన రూ.2,000 కోట్ల విలువైన ఆస్తులను కేవలం రూ.50 లక్షలకు సోనియా, రాహుల్ గాంధీ కొనుగోలు చేశారని ఈడీ అభియోగాలు మోపింది.

వైఐఎల్​లో రాహుల్​కు 38శాతం, సోనియాకు 38శాతం షేర్లు ఉన్నాయి. ఏజేఎల్‌కు చెందిన 99 శాతం షేర్లను యంగ్ ఇండియన్ లిమిటెడ్‌కు బదిలీ చేశారు. ఈ లావాదేవీ మనీలాండరింగ్‌లో భాగమన్నది ఈడీ ప్రధాన ఆరోపణ.