భారత గగనతలంపై పాక్ విమానాలకు నిషేధం

భారత గగనతలంపై పాక్ విమానాలకు నిషేధం
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకు ఇప్పటికే కీలకమైన సింధూ నదీ జలాల ఒప్పందం అమలు నిలిపివేసిన భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌ విమానాలు భారత గగనతలంపై ప్రయాణించకుండా నిషేధం విధించింది. ఈ దెబ్బతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాకిస్థాన్​ ఎయిర్‌లైన్లకు ఇది మరింత శరాఘాతం కానుంది.

రెండు దేశాల సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలోనే పాక్‌ గగనతలంపై మన దేశ విమానాల రాకపోకలపై నిషేధం విధించడంపై భారత్‌ కూడా దీటుగా స్పందించింది. పాక్‌ విమానయాన సంస్థలకు భారత గగనతలాన్ని మూసివేసింది. ఇందుకు సంబంధించి నోటమ్‌ జారీ చేసింది. ఈ నిర్ణయం ఏప్రిల్‌ 30 నుంచి మే 23 వరకు అమలులో ఉండనుంది.  దీంతో పాక్‌కు సంబంధించిన కమర్షియల్‌, లీజుకు తీసుకున్న, సైనిక విమానాలు భారత గగనతలాన్ని ఉపయోగించుకోవవడానకి అవకాశం లేదు. 

భారత్​ తీసుకున్న ఈ నిర్ణయంతో పాకిస్థాన్​ విమానాలకు తీవ్ర ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. పాకిస్థాన్ విమానాలు కౌలాలంపూర్‌ సహా మలేసియాలోని ఇతర నగరాలు, సింగపూర్‌, థాయ్‌లాండ్‌ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే ఇప్పుడు చైనా, శ్రీలంక గుండా దూరప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీని వల్ల ప్రయాణ సమయం పెరగడమే కాకుండా నిర్వహణకు అదనపు భారం పడుతుంది.

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌, భారత్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రమంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించారు. తొలుత భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీతో(సీసీఏ) సమావేశమైన ప్రధాని అనంతరం రాజకీయ వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీతో(సీసీపీఏ) భేటీ అయ్యారు. ప్రధానితోపాటు హోం మంత్రి, రక్షణ మంత్రి, ఆర్థిక మంత్రి, విదేశాంగ మంత్రి సభ్యులుగా ఉండే భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ పహల్గాం ఘటన తర్వాత సమావేశం కావడం ఇది రెండోసారి. 

 
అయితే రాజకీయ వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. దీనినే సూపర్‌ క్యాబినెట్‌ అని కూడా పిలుస్తారు. 2019లో పుల్వామా ఉగ్రదాడి తర్వాత సూపర్‌ క్యాబినెట్‌ సమావేశం కావడం ఇదే తొలిసారి. ఈ కమిటీలో కేంద్ర క్యాబినెట్‌లోని టాప్‌ మంత్రులు సభ్యులుగా ఉంటారు. ప్రస్తుత సీసీపీఏలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోం మంత్రి అమిత్‌ షా, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఉన్నారు.

2019లో పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఘటనపై ప్రతీకార చర్యలు చేపట్టడంపై చర్చించేందుకు సీసీపీఏ సమావేశమైంది. కొన్ని రోజుల తర్వాత ఫిబ్రవరి 26న భారత వాయుసేన పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్ర శిబిరాలపై దాడుల చేసిన సంగతి తెలిసిందే. 
ఇప్పుడు పహల్గాం ఉగ్రదాడి తర్వాత సీసీపీఏ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఉగ్రదాడికి ప్రతీకారంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారన్నదానిపై ఆసక్తి నెలకొంది.