
పహల్గాం దాడిలో పాల్గొన్న వారిలో కొందరు గతంలో గగన్నగర్, గండేర్బల్ అడవుల్లో ఆరుగురు స్థానికేతరులు, ఒక డాక్టర్ను, ఇద్దరు సైనిక పోర్టర్లను హత్య చేసిన ఘటనల్లోనూ పాల్గొన్నారు. హషిమ్ మూసా మాత్రం ఈ మూడు దాడుల్లోను పాల్గొన్నాడు. ఇక జునైద్భట్, అర్బాజ్ మిర్ కూడా పాకిస్థాన్లో శిక్షణ పొందినట్లు గుర్తించారు.
పహల్గాంకు చేరుకునేందుకు ఉగ్రవాదులు దాదాపు 22 గంటలపాటు ట్రెక్కింగ్ చేసినట్లు దర్యాప్తులో తేలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. తమ ప్రణాళికను అమలుచేసేందుకు కోకెర్నాగ్ అడవుల నుంచి బైసరన్ లోయ వరకు కాలి నడకన వచ్చినట్లు తెలుస్తోంది. ఆ ఉగ్రవాదులు సైనిక శిక్షణ పొందారనడానికి ఇది కూడా ఒక నిదర్శనం. ఈ ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భారత సైన్యం ముమ్మరంగా వేటాడుతోంది. వాళ్లు భద్రతా దళాల నుంచి నాలుగుసార్లు త్రుటిలో తప్పించుకున్నారు. త్వరలోనే వాళ్ల కథ ముగుస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కశ్మీర్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కశ్మీర్లోని పలు పర్యాటక ప్రాంతాలను మూసివేసింది.
పెహల్గామ్ ఉగ్రదాడిపై ఆగ్రహంతో ఉన్న సైన్యం కశ్మీర్లోని ఉగ్రవాదుల ఇళ్లను ధ్వంసం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు ప్రతీకారంతో రగిలిపోతున్న ముష్కరులు పెద్ద ఎత్తున దాడులు, హత్యలకు ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. కశ్మీర్ లోయలో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా సంస్థల హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
కశ్మీర్లో మొత్తం 87 పర్యాటక ప్రాంతాలుండగా అందులో 48 ప్రాంతాలను మూసివేసింది. ఆ ప్రాంతాల్లో సాయుధ బలగాలతో భద్రత కల్పించిన తర్వాతే వాటిని తిరిగి ఓపెన్ చేస్తామని వెల్లడించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టూరిస్ట్ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
More Stories
ఐపీఎస్ అధికారి పూరన్ ఆత్మహత్యపై సిట్
శబరిమల ఆలయం బంగారు మాయంపై క్రిమినల్ కేసు
ఆఫ్ఘన్ భూభాగాన్ని మరో దేశంకు వ్యతిరేకంగా అనుమతించం!