పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగాపాక్ పై దౌత్యపర చర్యలు

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగాపాక్ పై దౌత్యపర చర్యలు
 
* సింధు జలాల ఒప్పందం, పాక్ సార్క్ వీసాలు రద్దు వాఘా సరిహద్దు మూసివేత
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై దౌత్యపరమైన చర్యలను భారత ప్రభుత్వం బుధవారం ప్రారంభించింది.  కశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రదాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దాడి వెనుక ఉన్న పాకిస్థాన్‌తో సంబంధాలపై అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థాన్‌ దాహార్తిని తీర్చే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసేసింది.  వాఘా- అట్టారీ సరిహద్దును తక్షణం మూసివేసింది. పాక్‌ జాతీయులకు భారత్‌లోకి ప్రవేశాన్ని నిషేధించడంతోసహా మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆయన నివాసంలో బుధవారం సాయంత్రం ‘భద్రతపై క్యాబినెట్‌ కమిటీ (సీసీఎస్‌)’ సమావేశమైంది.  ఉగ్రదాడిని తీవ్రపదజాలంతో ఖండించింది. దాడిలో మృతి చెందినవారి కుటుంబాలకు సానుభూతి తెలిపింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. పహల్గాంలో పర్యటించి వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అక్కడి పరిస్థితి గురించి భేటీలో వివరించారు. 
 
ఈ దాడికి పాల్పడినవారిని, అందుకు ప్రేరేపించినవారిని తీవ్రంగా శిక్షించేంతవరకూ విశ్రమించకూడదని సమావేశం నిర్ణయించింది. పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని త్రివిధ దళాలకు సూచించింది. కాగా, పహల్గాం ఉగ్రదాడిపై గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కూడా ఈ భేటీలో నిర్ణయించారు. సీసీఎస్‌ సమావేశం ముగిసిన అనంతరం.. అందులో తీసుకున్న కీలక నిర్ణయాల గురించి విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ మీడియాకు వెల్లడించారు

ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో 1960లో కుదుర్చుకున్న సింధు జలాల ఒప్పందం అమలు నిలిపివేత. ఈ నిర్ణయంతో సింధు, దాని ఉపనదులైన జీలమ్‌, చీనాబ్‌, రావి, బియాస్‌, సట్లెజ్‌ నుంచి పాకిస్థాన్‌కు నీటి సరఫరాను ఆపేస్తారు. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతును పాక్‌ విశ్వసనీయంగా, కచ్చితంగా నిలిపివేసేదాకా ఈ ఒప్పందం అమలు కాదని భారత్‌ ప్రకటించింది.

వాఘా- అట్టారీ వద్ద ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్ట్‌ తక్షణ మూసివేత. సరైన పత్రాలతో ఆ దారి గుండా ఇప్పటికే భారత్‌లోకి ప్రవేశించినవారు మే1లోపు అదే మార్గంలో వెళ్లిపోవాలని ఆదేశించింది. సార్క్‌ వీసా మినహాయింపు పథకం కింద పాక్‌ జాతీయులకు భారత్‌లోకి ప్రవేశం నిషిద్ధం. ఇప్పటికే అలా వచ్చినవారి వీసాలు రద్దయిపోతాయి.  ఈ మినహాయింపు కింద భారత్‌లో ఉన్న పాక్‌ జాతీయులందరూ 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాల్సి ఉంటుంది.

న్యాయమూర్తులు, చట్టసభల సభ్యులు, సీనియర్‌ అధికారులు, వాణిజ్య ప్రముఖులు, పాత్రికేయులు, క్రీడా ప్రముఖులు.. ఇలా 24 కేటగిరీలకు చెందిన ప్రముఖులు సార్క్‌ దేశాల మధ్య వీసా రహిత ప్రయాణం చేసేందుకు వీలుగా 1992లో ఈ పథకాన్ని ప్రారంభించారు.  దీని కింద ఆయా కేటగిరీలకు చెందిన ప్రముఖులకు వారి వారి దేశాలు ఏడాది వ్యాలిడిటీ ఉన్న ప్రత్యేక వీసా స్టికర్‌ ఇస్తాయి. ఆ స్టికర్‌ ఉంటే సార్క్‌ దేశాలకు వారు సంప్రదాయ వీసా లేకుండానే ఎన్నిసార్లయినా రావొచ్చు, పోవచ్చు.

పాకిస్థానీ హైకమిషన్‌లో ఉన్న రక్షణ, సైనిక, నౌకా దళ, వైమానిక దళ సలహాదారులందరినీ అవాంఛిత వ్యక్తులుగా (పర్సొనా నాన్‌ గ్రేటా) ప్రకటించింది. వారం రోజుల్లోగా వారంతా తమ దేశానికి తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించింది. అలాగే ఇస్లామాబాద్‌లో ఉన్న భారత హైకమిషన్‌లోని రక్షణ, సైనిక, నౌకా దళ, వైమానిక దళ సలహాదారులందరినీ భారత్‌ ఉపసంహరించుకుంది. 

ఆ పోస్టులన్నీ రద్దు చేసింది. రెండు దేశాల్లోని హైకమిషన్లలో సిబ్బంది సంఖ్యను 55 నుంచి 30కి తగ్గించింది. మే 1 నుంచి ఈ నిర్ణయం అమలు కానుంది. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, ఎస్ జైశంకర్, నిర్మలా సీతారామన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

  • 1960లో పాక్‌తో కుదుర్చుకున్న సింధూ నదీ జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలుపుదల చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. సీమాంతర ఉగ్రవాదానికి అందచేస్తున్న మద్దతును నిలిపివేస్తున్నట్లు పాక్‌ నుంచి స్పష్టమైన, విశ్వసనీయమైన ప్రకటన వెలువడే వరకు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
  • అటారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్టును వెంటనే మూసివేస్తున్నట్లు తెలిపింది. చట్టబద్ధమైన పత్రాలతో భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్థానీ పౌరులు మే 1వ తేదీలోగా ఈ మార్గంలో తిరిగి వెళ్లిపోవచ్చని భారత్‌ ప్రకటించింది.
  • సార్క్‌ వీసా మినహాయింపు పథకం కింద పాకిస్థానీ జాతీయులు భారత్‌లో ప్రయాణించడానికి అనుమతించబోమని ప్రభుత్వం ప్రకటించింది. పథకం కింద గతంలో పాకిస్థానీ జాతీయులకు జారీ చేసిన వీసాలు రద్దయినట్లేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకం కింద వీసా తీసుకుని ప్రస్తుతం భారత్‌లో ఉన్న పాకిస్థానీ జాతీయులు 48 గంటల్లోగా భారత్‌ను వీడాలని ప్రభుత్వం ఆదేశించింది.
  • ఇస్లామాబాద్‌లోని భారతీయ హై కమిషన్‌ నుంచి తన రక్షణ, నౌకాదళ, వైమానిక సలహాదారులను ఉపసంహరిస్తున్నట్లు భారత్‌ ప్రకటించింది. అదే విధంగా ఢిల్లీలోని పాకిస్థానీ హై కమిషన్‌లో ఉన్న ఆ దేశ సైనిక, నౌకాదళ, వైమానిక సలహాదారులు వారం రోజుల్లోగా భారత్‌ను వీడాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
  • భారత్‌లోని పాక్‌ హై కమిషన్లలోని దౌత్యాధికారుల సంఖ్యను ప్రస్తుతమున్న 55 నుంచి 30కి తగ్గించాలని పాకిస్థాన్‌ను ఆదేశించినట్టు విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ తెలిపారు.