ఆక్రమిత కాశ్మీర్ సమీపంలో 42 ఉగ్రవాద శిక్షణ కేంద్రాలు

ఆక్రమిత కాశ్మీర్ సమీపంలో 42 ఉగ్రవాద శిక్షణ కేంద్రాలు
భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌ ఉగ్రవాద కార్ఖానాలు నడుపుతోంది. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లో 42 ఉగ్రవాద శిక్షణ కేంద్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి నియంత్రణ రేఖకు సమీపంలోనే ఉన్నట్లు నిఘా వర్గాలు తాజాగా గణాంకాలు విడుదల చేశాయి. అందులో వందల సంఖ్యలో ముష్కరులు శిక్షణ పొందుతున్నట్లు సమాచారం.  పహల్గాంకు సమీపంలోని పర్యాటక కేంద్రం బైసరన్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్రతండాల వివరాలను నిఘావర్గాలు వెల్లడించాయి.
నియంత్రణ రేఖకు సమీపంలోని పీవోకేలో ఉన్న 42 ఉగ్రవాద శిక్షణా కేంద్రాల్లో 115 నుంచి 130 మంది ఉగ్రవాదులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అందులో 115 మంది పాకిస్థాన్‌ జాతీయులని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక జమ్ముకశ్మీర్‌ విషయానికొస్తే 130 నుంచి 140 మంది వరకు ఉగ్రవాదులు ఉండొచ్చని భద్రతా దళాలు అంచనా వేశాయి.
కశ్మీర్‌ లోయలో 70నుంచి 75 మంది ఉగ్రవాదులు యాక్టివ్‌గా ఉన్నట్లు సమాచారం. 60 నుంచి 65 మంది జమ్ము, రాజౌరీ, పూంచ్‌ రీజియన్లలో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.  జమ్ము కశ్మీర్‌లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు ఉన్నారని భద్రతాసంస్థలు వెల్లడించాయి. వారిలో అత్యధికంగా లష్కరే తొయిబా ముఠా సభ్యులే ఉన్నట్లు పేర్కొన్నాయి. అందులో 18 మంది జైషే మహమ్మద్, 35 మంది లష్కరే తొయిబా, ముగ్గురు హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందినవారు ఉన్నారు. 

మరో 17 మంది స్థానిక ఉగ్రవాదులు ఉన్నారు. విదేశీ ఉగ్రవాదులతో పోలిస్తే స్థానిక ఉగ్రవాదుల సంఖ్య తక్కువగా ఉంది. విదేశీ ఉగ్రవాదుల సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని అధికారులు అంటున్నారు. ఉగ్రవాదులు జరిపిన నరమేధంలో ప్రాణాలు కోల్పోయిన 26 మంది వివరాలతో అధికారులు ఓ జాబితాలో తయారు చేశారు. మృతుల్లో ఐఏఎఫ్‌ కార్పోరల్‌, నేవీ, ఎక్సైజ్‌ అధికారితో పాటు కర్ణాటకకు చెందిన ఓ వ్యాపారవేత్త కూడా ఉన్నారు. అయితే మృతుల్లో ఎక్కువ మంది (ఆరుగురు) మహారాష్ట్రకు చెందిన పర్యాటకులు.

ఉగ్రదాడికి బలైన వారిలో గుజరాత్‌-3, కర్ణాటక-3, పశ్చిమ బెంగాల్‌-3 ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌, కేరళ, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌, హరియాణా, ఉత్తరాఖండ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. ఒక నేపాలీ వ్యక్తి కూడా ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించారు.  అంతేకాదు పాక్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో పహల్గాంకు చెందిన ఓ స్థానికుడు కూడా ఉన్నారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, ఉగ్రవాదులు పర్యటకులను ఒక్కదగ్గరకు చేర్చి, వారి వివరాలు అడిగారు. కల్మా చదవమని అడిగారు. తరువాత ముస్లింలు కాని పురుషులను ఒక్కొక్కొరిగా చంపుతూ పోయారు.