శనివారం పోప్ ఫ్రాన్సిస్​ అంత్యక్రియలు

శనివారం పోప్ ఫ్రాన్సిస్​ అంత్యక్రియలు
పోప్​ ఫ్రాన్సిస్​ అంత్యక్రియలను శనివారం ఉదయం 8 గంటలకు నిర్వహించనున్నట్లు వాటికన్ చర్చి ప్రకటించింది. వాటికన్ నగరంలోని సెయింట్​ పీటర్స్ బాసిలికాలో ఈ అంత్యక్రియలు జరుగుతాయని తెలిపింది. ప్రస్తుతం పోప్​ ఫ్రాన్సిస్​  మృతదేహాన్ని వాటికన్​లోని ఆయన ప్రైవేట్ ప్రార్థనా మందిరం శాంటా మార్టాలో ఉంచినట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా విడుదల చేసింది.

బుధవారం సెయింట్ పీటర్స్​ బాసిలికాలో ప్రజల దర్శనార్థం పోప్ ఫ్రాన్సిస్ భౌతిక కాయాన్ని ఉంచాలని కార్డినల్ నిర్ణయించారు. అలాగే పోప్​నకు చెందిన ఫిషర్​మ్యాన్స్​ రింగ్​, సీసం ముద్రను మరెవరూ ఉపయోగించకూడదని తీర్మానించారు. సంప్రదాయం ప్రకారం, పోప్​ను సెయింట్​ పీటర్స్​ బాసిలికాలో ఖననం చేస్తారు. కానీ దీనికి భిన్నంగా రోమ్​లోని సెయింట్ మేరీ మేజర్ బాసిలికాలో తనను ఖననం చేయాలని పోప్ ఫ్రాన్సిస్ కోరుకున్నారు.

తన అంత్యక్రియలు జరగడానికి రోమ్‌లోని నాలుగు ప్రధాన చర్చిల్లో ఒకటైన సెయింట్‌ మేరీ మేజర్‌ను ఎంపిక చేసుకోవడంలో కూడా పోప్‌ ఫ్రాన్సిస్‌ సంప్రదాయాన్ని ఛేదించారు. వాటికన్‌ సిటీ నుండి రోడ్డు మార్గాన రోమ్‌లోని సెవెన్‌ హిల్స్‌లో ఒకటైన ఎస్క్యూలిన్‌ వరకు అంతిమ యాత్ర సాగుతుంది. 

పోప్‌ తన పదవికి ఒక మానవతా, వినయపూర్వకమైన కోణాన్ని ఇవ్వడానికి ఎల్లప్పుడూ పరితపించేవారు. ఆ స్ఫూర్తితోనే వాటికన్‌ సాంప్రదాయ వైభవాలను విడనాడి తన అంత్యక్రియల ప్రక్రియ, ఖననం అంతా కూడా సరళమైన ఆచార వ్యవహరాల్లో సాగాలని నిర్ణయించారు. ఆర్భాటాలేమీ లేకుండా సాదా సీదాగా తనను భూమిలో ఖననం చేయాలని ఆయన కోరారు. లాటిన్‌ భాషలో తన పేరును ఫ్రాన్సిస్కస్‌ అని మాత్రమే రాయించాలని సూచించారు.

“నా జీవితాంతం నేను ఒక ప్రీస్ట్​గా, బిషప్​గా పనిచేశారు. నేను ఎల్లప్పుడూ మన ప్రభువు తల్లి, బ్లెస్డ్​ వర్జిని మేరీకి నన్ను నేను అప్పగించుకున్నాను. కనుక నన్ను సెయింట్ మేరీ మేజర్ పాపల్ బాసిలికాలో ఖననం చేయాలని కోరుకుంటున్నాను. పునరుత్థాన దినం కోసం అక్కడే నేను వేచి ఉండాలని కోరుకుంటున్నాను. నా సమాధి చాలా సామాన్యంగా, ప్రత్యేక ఆకర్షణ లేకుండా ఉండాలి”  అని ఆయన కోరుకున్నారు.

పోప్ అంత్యక్రియలకు హాజరయ్యే ప్రపంచ నాయకుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ ఉన్నారు. వలసల సమస్యపై పోప్​ ఫ్రాన్సిస్​తో ట్రంప్ పదేపదే విభేదించిన విషయం తెలిసిందే.  జర్మనీ ఛాన్సలర్‌ ఓల్ఫ్‌ షుల్జు, ఫ్రాన్స్‌ అధ్యక్షులు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌, బ్రెజిల్‌ అద్యక్షులు లూలా డసిల్వా, ఉక్రెయిన్‌ అధ్యక్షులు జెలెన్‌స్కీ, ఇయు చీఫ్‌ ఉర్సులా వాన్‌ డెర్‌ లేయన్‌, యురోపియన్‌ కమిషన్‌, యురోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షులు సహా పలువురు అధినేతలు రానున్నారు. 

ప్రస్తుతం వాటిక‌న్‌లో తొమ్మిది రోజుల సంతాప దినాలు ప్రక‌టించారు. అంత్యక్రియలు జరిగే రోజు శనివారం జాతీయ సంతాప దినంగా పాటించనున్నట్లు పోలెండ్‌ ప్రకటించింది. తూర్పు తైమూర్‌ దేశం ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. పోప్‌ మృతికి సంతాప సూచకంగా భారత్‌ మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. 22, 23 తేదీలతో పాటూ అంత్యక్రియలు జరిగే 26న సంతాప దినాలుగా పాటిస్తోంది. ఆయన తన పదవీకాలంలో సాంప్రదాయవాదులతో ఘర్షణ పడ్డారు. పేద, అణగారిన వర్గాలకు అండగా నిలబడ్డారు.