ముంబయి నటి వేధింపుల కేసులో ఐపీఎస్‌ పీఎస్ఆర్ అరెస్ట్

ముంబయి నటి వేధింపుల కేసులో ఐపీఎస్‌ పీఎస్ఆర్ అరెస్ట్
 

ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అరెస్ట్‌ అయ్యారు. ముంబయి నటి జెత్వానీ కేసులో ఏపీ సీఐడీ అధికారులు ఆయన్ను హైదరాబాద్‌ బేగంపేటలోని నివాసంలో అదుపులోకి తీసుకుని పోలీసులు విజయవాడకు తరలిస్తున్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో ఆంజనేయులు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పని చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డికి  ఆయన అత్యంత విధేయుడిగా పేర్కొందారు.

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై నిర్బంధంలో చిత్రహింసలు  కేసులో కూడా ఆంజనేయులు నిందితుడిగా ఉన్నారు. విజయవాడలో ముంబై సినీ నటిపైపై గతేడాది కేసు నమోదైంది. వైఎస్సార్‌సీపీ నేత విద్యాసాగర్‌పై తాను పెట్టిన కేసును ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేయడానికే తనపై ఈ కేసు పెట్టారని నటి ఆరోపించారు. 
ఆ సమయంలో పీఎస్సార్ ఆంజనేయులు ఇంటిలిజెన్స్ చీఫ్‌గా ఆ మొత్తం వ్యవహారం నడిపించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
విజయవాడ సీపీగా కాంతిరాణా, డీసీపీగా విశాల్ గున్నీ పనిచేసే సమయంలో ఈ ఘటన జరిగింది. వైఎస్సార్‌సీపీ నేత విద్యాసాగర్ ఫిర్యాదుతో నటితో పాటుగా ఆమె తల్లిదండ్రులు, సోదరుడిపై కూడా కేసు నమోదు చేశారు. ఇదే కేసులో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు క్రాంతి రాణా టాటా, విశాల్‌ గున్నీ నిందుతులుగా ఉన్నారు. అయితే వారిద్దరి హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఆంజనేయులు మాత్రం ఇప్పటివరకూ బెయిల్‌ కోసం అప్పీల్‌ చేసుకోకపోవడం గమనార్హం.
 
గతేడాది ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫిబ్రవరి 3న ముంబైలో నటితో పాటుగా, ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేసి విజయవాడకు తీసుకువచ్చారు. ఆమెపై నమోదు చేసిన కేసు గురించి పోలీసులు ఎవరికీ చెప్పలేదు. ఈ విషయం 2024 ఆగస్టు 26న బయటపడింది. ఆ తర్వాత ముంబై నటి విజయవాడ వచ్చి విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబును కలిసి ఫిర్యాదు చేశారు. 
 
ముంబై నటి ఫిర్యాదు తర్వాత ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్‌గున్నీ, ఏసీపీ హనుమంతరావు, సీఐ సత్యనారాయణలను సస్పెండ్ చేశారు. గతేడాది సెప్టెంబర్‌లో వైఎస్సార్‌సీపీ నేత విద్యాసాగర్, ఐపీఎస్ అధికారులపై కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ రెండు కేసులను సీఐడీకి బదిలీ చేశారు.  కాగా, ఇటీవల ముంబై నటి విజయవాడకు వచ్చారు. తన కేసు విచారణను వేగవంతం చేయాలని కోరారు.. ఈ క్రమంలో సీఐడీ అధికారులు సీనియర్ ఐపీఎస్ పీ సీతారామాంజనేయుల్ని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.