దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి డి విటమిన్ లోపం

దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి డి విటమిన్ లోపం
దేశంలోని ప్రతి ఐదుగురిలో ఒకరు (49 కోట్ల మంది) ‘డీ’ విటమిన్‌ లోపంతో బాధపడుతున్నట్టు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ ఎకానమిక్‌ రి సెర్చ్‌ (ఐసీఆర్‌ఐఈఆర్‌) వెల్లడించింది. వారిలో దాదాపు 30% మంది పిల్లలు, యుక్తవయసులు ఉన్నట్టు పేర్కొన్నది. పురుషుల కంటే మహిళల్లో ‘డీ’ విటమిన్‌ లోపం ఎక్కువగా ఉన్నట్టు స్పష్టంచేసింది. 
 
పట్టణాల్లో నివసించే మహిళల్లో 80% మంది విటమిన్‌ ‘డీ’ లోపంతో బాధపడుతున్నారని పేర్కొంది.  దేశంలో ఏడాది పొడవునా తగినంత సూర్యరశ్మి ఉన్నప్పటికీ కాలుష్యం పెరుగుదల, పట్టణీకరణ, ఆధునిక జీవనశైలి ‘డీ’ విటమిన్‌ లోపానికి దారితీస్తున్నట్టు ఐసీఆర్‌ఐఈఆర్‌ వెల్లడించింది.  సూర్యుడి నుంచి వెలువడే అతినీల లోహిత బీ (యూవీబీ) రేడియేషన్‌ ‘డీ’ విటమిన్‌ను పొందేందుకు దోహదం చేస్తుందని, నగరాల్లో పెరిగిన వాయు కాలుష్యం ఆ రేడియేషన్‌కు అడ్డుపడి చర్మాన్ని తాకకుండా నిరోధిస్తుండటం ప్రజల్లో ‘డీ’ విటమిన్‌ లోపం పెరుగుదలకు ప్రధాన కారణమని వివరించింది. 
 
ఔట్‌డోర్‌ యాక్టివిటీస్‌ తగ్గడం ‘డీ’ విటమిన్‌ లోపానికి మరో కారణమని పేర్కొన్నది. దీన్ని నివారించాలంటే రోజూ కనీసం 20నిమిషాలు సూర్యకాంతిలో ఉండాలని స్పష్టంచేసింది. స్వీయ మందుల వాడకానికి దూరంగా ఉండాలని, ‘డీ’ విటమిన్‌ సప్లిమెంట్లను వైద్యుడి సలహా మేరకు తీసుకోవాలని సూచించింది. ‘డీ’ విటమిన్‌ లోపం నడుము నొప్పికి, ఎముకల్లో పగుళ్ల (ఫ్రాక్చర్స్‌)కు దారితీస్తుంది. ఈ సమస్యలపై హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆర్థోపెడిక్‌ విభాగం 2019-21లో రెండు కీలక ర్యాండమైజ్డ్‌ కంట్రోల్డ్‌ ట్రయల్స్‌ (ఆర్సీటీ) అధ్యయనాలను నిర్వహించింది. వాటి వివరాలు ‘జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ ఆర్థోపెడిక్స్‌ అండ్‌ ట్రామా’లో ప్రచురితమయ్యాయి.