ఉక్రెయిన్ లో రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ

ఉక్రెయిన్ లో రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ
ఈస్టర్‌ సందర్భంగా ఉక్రెయిన్‌లో తాత్కాలికంగా కాల్పుల విరమణను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ శనివారం ప్రకటించారు. మాస్కో కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 6 గంటల నుండి ఆదివారం అర్ధరాత్రి వరకు ఈ కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని తెలిపారు. ఈ సమయంలో అన్ని సైనిక కార్యకలాపాలు నిలిపివేయబడతాయని ప్రకటించారు. 
 
చీఫ్‌ ఆఫ్‌ ది జనరల్‌ స్టాఫ్‌ వాలెరి గ్రెసిమొవ్‌తో జరిగిన సమావేశంలో పుతిన్‌ ఈ ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌ కూడా ఇదే పద్దతిని అనుసరిస్తుందని భావిస్తున్నట్లు పుతిన్‌ పేర్కొన్నారు. అదే సమయంలో కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరిగినా, శత్రువు నుండి కవ్వింపు చర్యలు ఎదురైనా, దురాక్రమణ చర్యలకు దిగినా వాటిని తిప్పికొట్టడానికి తమ బలగాలు సిద్ధంగా వుండాలని పుతిన్‌ స్పష్టం చేశారు.
 
రాబోయే రోజుల్లో ఎలాంటి పురోగతి లేని పక్షంలో రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చే ప్రయత్నాల నుండి అమెరికా వైదొలగుతుందని విదేశాంగ మంత్రి మార్కో రూబియో శుక్రవారమే హెచ్చరించిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. రష్యాలోని కుర్స్క్‌ ప్రాంతంలో పట్టున్న చిట్ట చివరి ప్రాంతాల్లో ఒకదాన్నుండి ఉక్రెయిన్‌ బలగాలను తమ సైన్యం పారద్రోలిందని రష్యా రక్షణ శాఖ ప్రకటించిన రోజునే ఈ ప్రకటన వెలువడింది. 
 
గతేడాది కుర్క్స్‌ ప్రాంతంలోకి ఉక్రెయిన్‌ బలగాలు అకస్మాత్తుగా చొరబడి స్వాధీనం చేసుకున్నాయి. ఉక్రెయిన్‌తో గల సరిహద్దులో కుర్క్క్‌ ప్రాంతంలో ఒలెషన్యా గ్రామాన్ని తమ బలగాలు స్వాధీనం చేసుకున్నాయని శనివారం రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఒలెషిన్యా గ్రామానికి దక్షిణంగా 11 కిలోమీటర్ల ప్రాంతంలో భీకరంగా పోరాటం సాగిందని రష్యా వార్తా సంస్థ టాస్‌ పేర్కొంది.

అంతకు ముందు, ఉక్రెయిన్‌లో శాంతిస్థాపనకు చర్యలు తీసుకుంటామని ఆ దిశగా త్వరలో అడుగు ముందుకు పడే అవకాశం ఉందని రష్యా పేర్కొంది. తమ సొంత ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఉక్రెయిన్‌, అమెరికాతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు. ఈ చర్చలు చాలా క్లిష్టమే అయినా వాటిని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం ముగించే విషయమై పురోగతి లేకుంటే ఇరుదేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చే ప్రయత్నాల నుంచి తాము తప్పుకుంటామన్న అమెరికా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్‌ స్పందించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, పుతిన్‌ మధ్య ప్రస్తుతానికి ముందస్తు సమావేశాలు లేవని, అవసరం అయితే భేటీ అవుతారని డిమిత్రి పెస్కోవ్ తెలిపారు. 

ఈ ఘర్షణ విషయంలో ఐరోపా దేశాలు ఉక్రెయిన్‌పై ఎలాంటి ఒత్తిడి తేవటం లేదని ఆయన విమర్శించారు. పారిస్‌లో జరిగిన భేటీలో శాంతి ఒప్పందం ముసాయిదాకు ఐరోపా దేశాల నేతల నుంచి సానుకూల స్పందన వచ్చిన నేపథ్యంలో వచ్చేవారం లండన్‌లో మరో విడత చర్చలు జరగనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో చర్చలు ఓ కొలిక్కి రాకపోవడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధ విరమణ చేయించాలన్న తన ప్రయత్నాలకు రష్యా, ఉక్రెయిన్​లు సహకరించడంలేదని అసహనం వ్యక్తం చేశారు. యుద్ధం ముగించేందుకు కొన్ని నెలలుగా జరుగుతున్న ప్రయత్నాలు విఫలమైనా, రష్యా-ఉక్రెయిన్‌ శాంతి ఒప్పందంలో పురోగతి సాధించలేకపోయినా, చర్చల ప్రక్రియ నుంచి యూఎస్​ వైదొలిగేందుకు వెనుకాడబోదని ట్రంప్​ స్పష్టం చేశారు. 

రష్యా, ఉక్రెయిన్‌లలో ఏ దేశమైనా సరే ఏ ఒక్క కారణంతోనైనా శాంతి ప్రక్రియ నుంచి తప్పుకుంటే రెండు పక్షాలనూ తెలివి తక్కువ వారుగా, మూర్ఖులుగా పరిగణిస్తామని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. దీనితో రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్‌ శాంతి చర్చలపై తాజాగా స్పందించింది. ఉక్రెయిన్‌తో శాంతి స్థాపనకు చర్యలు తీసుకుంటామని, ఈ దిశగా త్వరలో ముందుకు సాగే అవకాశం ఉందని పేర్కొంది.