
సెలబ్రిటీల సోషల్మీడియా ఖాతాలు హ్యాక్కు గురి అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల సింగర్ శ్రేయాఘోషల్, మంచు లక్ష్మి, త్రిష ఖాతాలు హ్యాక్ అయ్యాయి. అయితే ఈ ఘటనలు మరువకముందే తాజాగా మరో సెలబ్రిటీల సోషల్మీడియా ఖాతా హ్యాక్కు గురి అయ్యింది. తమిళ నటి, జాతీయ మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు ఖుష్బూ ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయ్యింది.
శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఆమె ఎక్స్ ఖాతాలో వరుస సందేశాలు పోస్ట్ అవుతుండడంతో ఆ సందేశాలు చూసిన నెటిజన్లు ఆమె ‘ఎక్స్’ ఖాతా హ్యాకైందని భావించారు. ఈ క్రమంలోనే ఖుష్బూ ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ, తన ఎక్స్ (గతంలో ట్విటర్) ఖాతా హ్యాక్ అయిందని చెప్పారు. తాను ఎన్నిసార్లు ప్రయత్నించినా లాగిన్ కాలేకపోతున్నానని, ఐడీ, పాస్వర్డ్ వివరాలను అది అంగీకరించడం లేదని ఆమె తెలిపారు.
గత కొన్ని గంటల్లో తన పేజీలో వచ్చిన ఏ పోస్ట్ అయినా తనది కాదని ఆమె స్పష్టం చేశారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని, తన ఖాతా నుండి వచ్చే ఏ సందేశమైనా తాను పెట్టింది కాదని గుర్తించాలని ఆమె కోరారు. అప్పటి వరకు తాను ఇన్స్టాగ్రామ్ ద్వారా అందరికీ అందుబాటులో ఉంటానని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా, హ్యాకర్ నుండి తనకు వాట్సాప్ సందేశం కూడా వచ్చిందని ఖుష్బూ వెల్లడించారు.
ఆ సందేశాన్ని, హ్యాకర్ ఫోన్ నంబర్తో సహా స్క్రీన్షాట్ తీసి ఆమె పంచుకున్నారు. ఆ సందేశంలో, “హాయ్ ఖుష్బూ, మీ ట్విటర్ ఖాతాను నేనే హ్యాక్ చేశాను. మీ ఖాతా మాకు ఎలాంటి ఉపయోగం లేదని నేను అనుకోను” అని ఉంది. ఈ విషయంపై తమిళనాడు సైబర్ క్రైమ్ విభాగం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇంకా, హ్యాకర్ తన పేజీలో క్రిప్టో కరెన్సీ గురించి పోస్ట్లు పెడుతున్నారని, తాను వాటిని ప్రోత్సహించడం లేదని ఆమె స్పష్టం చేశారు.
More Stories
బిహార్ ఎన్నికల్లో వికాసానికి, వినాశనానికి మధ్య పోరు
ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త చిట్నిస్ కన్నుమూత
ఏఐతో డీప్ఫేక్, కృత్రిమ కంటెంట్ లపై కేంద్రం కొరడా