యెమెన్ చమురు రేవుపై యుఎస్ దాడుల్లో 74 మంది దుర్మరణం

యెమెన్ చమురు రేవుపై యుఎస్ దాడుల్లో 74 మంది దుర్మరణం
యెమెనీ హూతీ తిరుగుబాటుదారుల అధీనంలోని ఒక చమురు రేవుపై యుఎస్ వైమానిక దాడుల్లో 74 మంది హతులయ్యారని, మరి 171 మంది గాయపడ్డారని హూతీ వర్గం వెల్లడించింది. దీనిని హూతీ తిరుగుబాటుదారులు లక్ష్యంగా యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త దాడి వ్యూహం కింద అతిపెద్ద ప్రాణాంతక దాడిగా పరిగణిస్తున్నారు. మార్చి 15న మొదలైన ట్రంప్ వ్యూహం ప్రభావాన్ని మదింపు వేయడం కష్టసాధ్యం అవుతోంది. 

ఈ వ్యూహంపైన. దీని నిర్దిష్ట లక్ష్యాలపైన, హతుల సంఖ్యపైన యుఎస్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ ఇంతవరకు ఎటువంటి సమాచారాన్ని విడుదల చేయలేదు. చాలా వరకు దాడులు సైనిక, భద్రత ప్రదేశాలను లక్ష్యం చేసుకుని ఉండవచ్చు. అయితే, రాస్ ఇసా చమురు రేవుపై దాడి అమెరికా వ్యూహానికి సంబంధించి బాగా ఉద్ధృతమైనదిగా కనిపిస్తోంది. 

దాడిలో హతులైనవారి గ్రాఫిక్ ఫుటేజిని హూతీలు వెంటనే విడుదల చేశారు. ‘ఇరాన్ దన్ను ఉన్న హూతీ ఉగ్రవాదులకు ఈ ఇంధన వనరును నిర్మూలించి, పది సంవత్సరాలకు పైగా ఈ మొత్తం ప్రాంతాన్ని బీభత్సమయం చేసేందుకు హూతీ యత్నాలకు నిధులు సమకూర్చిన అక్రమ ఆదాయం లేకుండా చేసేందుకు యుఎస్ దళాలు ఈ దాడి జరిపాయి’ అని సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో తెలియజేసింది. 

‘హూతీ తిరుగుబాటుదారులను నిర్మూలించి, ప్రశాంతంగా జీవించాలని వాంఛిస్తున్న యెమెన్ ప్రజలకు హాని చేయడానికి ఈ దాడిని ఉద్దేశించలేదు’ అని సెంట్రల్ కమాండ్ తన ప్రకటనలో తెలిపింది. ప్రాణ నష్టం గురించిన సమాచారాన్ని అది ఇవ్వలేదు.  కాగా, ఇరాన్ అండ ఉన్న హూతీలు శుక్రవారం ఇజ్రాయెల్ దిశగా ఒక క్షిపణిని ప్రయోగించినట్లు, దానిని తాము అటకాయించినట్లు ఇజ్రాయెలీ మిలిటరీ తెలియజేసింది. 

టెల్ అవీవ్, ఇతర ప్రాంతాల్లో సైరన్లు మోగించారు. ఇది ఇలా ఉండగా, యెమెన్‌లో యుద్ధం మరింతగా అంతర్జాతీయ రూపు దాల్చింద. చైనీస్ ఉపగ్రహ సంస్థ ఒకటి హూతీ దాడులకు ‘ప్రత్యక్షంగా మద్దతు ఇస్తోంది’ అని యుఎస్ ఆరోపించింది. దీనిపై వ్యాఖ్యానించేందుకు బీజింగ్ శుక్రవారం నిరాకరించింది.