కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ తెలంగాణను ముంచే ఎత్తుగడలు

కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ తెలంగాణను ముంచే ఎత్తుగడలు
కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు కలిసి తెలంగాణను ముంచే ఎత్తుగడలు వేస్తున్నాయని  కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రజలను దోపిడీ చేసి, ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడి, ప్రజల రక్తం తాగిన మజ్లిస్ పార్టీకి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు జీ హుజూరంటున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

శుక్రవారం బేగంపేట హరిత ప్లాజాలో జరిగిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొంటూ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎందుకు పోటీ చేయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మజ్లిస్ పార్టీకి వంగి వంగి సలాం కొడుతున్న రాహుల్ గాంధీ, కేసీఆర్‌లకు బీజేపీని విమర్శించే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు.

రజాకార్ల వారసత్వాన్ని పొందిన మజ్లిస్ పార్టీకి వ్యతిరేకంగా జాతీయ వాద భావనతో బీజేపీ పోటీ చేస్తోందని ఆయన తెలిపారు. మజ్లిస్ పార్టీ,రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్వాతంత్ర్య సమరయోధులు, ఉద్యమకారుల వారసత్వాన్ని బీజేపీ కొనసాగిస్తోందని గుర్తు చేశారు. మజ్లిస్ పాత బస్తీకే మాత్రమే పరిమితం కాలేదని, ఆ పార్టీ ప్రస్తుతం తెలంగాణలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో చాప కింద నీరులా విస్తరిస్తోందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మజ్లిస్ పార్టీకి విజయాన్ని కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ మూడు పార్టీలు ఒకే తానుముక్కలుగా కలిసి పని చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో మజ్లిస్‌ను గెలిపించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. 

తెలంగాణ ప్రజలు చైతన్యంగా ఆలోచించక పోతే, మళ్లీ రజాకార్ల పాలన లాంటి పరిస్థితులు దాపురించే ప్రమాదం ఉందని కేంద్ర మంత్రి హెచ్చరించారు. మజ్లిస్ పార్టీ నాయకులు పాత బస్తీలోని హిందువుల ఇళ్లను స్వాధీనం చేసుకుని ప్రజలను ఖాళీ చేయించిన ఘటనలు చాలానే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను, హైదరాబాద్‌ను బలి చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వెనుకాడడం లేదని మండిపడ్డారు. 

ప్రజలను జాగృతం చేయాలనే పవిత్ర ఉద్దేశంతోనే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తోందని కిషన్ రెడ్డి చెప్పారు. తమకు గెలుపు ఒక్కటే ముఖ్యం కాదని, హైదరాబాద్‌ను రక్షించడం కూడా ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మజ్లిస్ పార్టీ మతోన్మాదం, గూండాయిజాన్ని ఎదుర్కొంటూ బీజేపీ ధర్మయుద్ధం చేస్తోందని చెప్పారు.

బీఆర్ఎస్ హయాంలో హైటెక్ సిటీలో రంగులు వేసి అభివృద్ధి అంటూ ప్రచారం చేశారని, కానీ అభివృద్ధి పేరు చెప్పి ఎక్కడైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కువ ఉందో అక్కడే పనులు జరిగాయని ఆరోపించారు. ఇరుకైన రోడ్లు సైతం నిర్మించారని,  జీహెచ్ఎంసీ స్థితి దారుణంగా మారిందని, వీధిలైట్లు కొనడానికి డబ్బుల్లేని స్థితికి దిగజారి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ పనితీరు అసమర్థంగా ఉందని, పౌర సేవల మెరుగుదలకు నిధులు సైతం పెరగడం లేదని ధ్వజమెత్తారు. మజ్లిస్ పార్టీ నుంచి నగరాన్ని రక్షించాలంటే..  చైతన్యంతో ఓటు వేయాలని ప్రజలకు ఆయన సూచించారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వచ్చినపుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.  కాంగ్రెస్ నాయకులు విదేశీ పెట్టుబడుల గురించి చెబుతున్నారని, కానీ అవి ఎక్కడికి వెళ్లాయని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక, పన్నుల సంస్కరణలు ఉగ్రవాదం, మతోన్మాదాన్ని అరికట్టడంతోపాటు సమర్థవంతమైన విదేశాంగ విధానం.. ఇలా అన్నింటిలో ప్రగతి కనిపిస్తోందని చెప్పారు. 

గతంలో విద్యుత్ కోసం రైతులు మోటార్ల దగ్గర నిద్రించాల్సి వచ్చేదని, కానీ మోదీ పాలనలో విద్యుత్ కోతల్లేని దేశంగా మారిందని తెలిపారు.  హైదరాబాద్ అంటే కేవలం హైటెక్ సిటీనే కాదని,  అంబర్ పేట్,సనత్ నగర్,మల్కాజ్‌గిరి,దిల్‌సుఖ్‌నగర్, గౌలిపుర, చార్మినార్, నాంపల్లి, సోమాజిగూడ, ఖైరతాబాద్, కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లో ప్రజల సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు.  హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గౌతం రావు గారిని గెలిపించేందుకు ప్రతి కార్యకర్త ఐకమత్యంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.