గ్రూప్‌-1 నియామకాలు నిలిపివేసిన హైకోర్టు

గ్రూప్‌-1 నియామకాలు నిలిపివేసిన హైకోర్టు
తెలంగాణాలో గ్రూప్‌-1 పోస్టుల నియామకాలకు బ్రేక్‌ పడింది. తాము ఆదేశించే వరకు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ పూర్తయ్యే వరకు గ్రూప్‌-1కు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కొనసాగించేందుకు అనుమతిచ్చింది. అభ్యర్థుల డాటా నమోదుకు సంబంధించిన కంప్యూటర్‌ లాగ్‌ హిస్టరీ సమర్పించాలని సర్వీస్‌ కమిషన్‌ను ఆదేశించింది.
గ్రూప్‌-1 పరీక్ష మూల్యాంకనంలో తప్పులు జరిగాయని, దీనిపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలంటూ ఎం పరమేశ్‌ సహా 20 మంది దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలపై సమగ్ర వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని న్యాయమూర్తి టీజీపీఎస్సీకి నోటీసులు జారీచేశారు. రీకౌంటింగ్‌ దరఖాస్తు చేస్తే మారులు తగ్గిన అభ్యర్థిని ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్లను కూడా ఆదేశించారు. పిటిషనర్లు ప్రస్తుతం ఎకడ పనిచేస్తున్నారో, వాళ్ల హోదా, ఇతర వివరాలను నివేదించాలని పేర్కొన్నారు. 

ఒకవేళ తప్పుడు వివరాలతో పిటిషన్లు వేసుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పిటిషనర్లను హెచ్చరించారు. అదే సమయంలో టీజీపీఎస్సీలో అవకతకవలు జరిగాయని తేలితే కూడా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు.

పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలో రెండే రెండు పరీక్షా కేంద్రాల నుంచి ఏకంగా 71 మంది ఎంపికయ్యారని చెప్పారు. ఇది అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నదని చెప్పారు. ఇక 482 మారులు వచ్చిన ఒక అభ్యర్థి ఇంకా ఎకువ మారులు వస్తాయని రీకౌంటింగ్‌ చేయించుకుంటే అవి 422కు తగ్గిపోయాయని తెలిపారు.

జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌లో పబ్లిష్‌ చేయడానికి కంప్యూటర్స్‌లో మార్పులు చేశారని, లాగ్‌ హిస్టరీ పరిశీలిస్తే ఈ బాగోతం బట్టబయలు అవుతుందని చెప్పారు. దీనిపై అడిగితే ఫోర్జరీ అని చెప్తున్నారని, ఇదే నిజమైతే ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని, ఇవన్నీ గ్రూప్‌-1లో అక్రమాలు జరిగాయని చెప్పడానికి కీలక అంశాలని తెలిపారు.

గ్రూప్‌-1 మెయిన్‌కు 21,075 మంది హాజరయ్యారని, ఆ తర్వాత తుది జాబితాలో ఆ సంఖ్య 21,085కు పెరిగిందని, కొత్తగా పది మంది ఎకడి నుంచి వచ్చారనే ప్రశ్నకు జవాబు లేదని రచనారెడ్డి చెప్పారు. గ్రూప్‌-1లో అక్రమాలు జరిగాయని చెప్పడానికి ఇంతకంటే మరో సాక్ష్యం అవసరం లేదని పేర్కొన్నారు. ఉర్దూలో 9 మంది పరీక్ష రాశారని ప్రకటించిన కమిషన్‌ ఆ తర్వాత ఆ సంఖ్యను 10 మంది అని చెప్పడం కూడా కూడా అలాంటి అక్రమమేనని తెలిపారు. 

ఇది ఎంతోకాలం గ్రూప్‌-1 పోస్టులను సాధించాలన్న నిరుద్యోగుల కలలను కల్లలు చేయడమేనని చెప్పారు. దేశంలోని వివిధ ప్రభుత్వ కాలేజీల్లోని నిపుణులైన ప్రొఫెసర్లతో మూల్యాంకనం చేయిస్తామని సర్వీస్‌ కమిషన్‌ చెప్పిందని, తీరా రిటైర్‌ అయిన వాళ్లతో చేయించిందని తెలిపారు. ప్రిలిమ్స్‌కు, మెయిన్‌కు హాల్‌ టికెట్ల నంబర్లు వేర్వేరుగా ఇవ్వడంలో కూడా కావాలని తప్పులు చేశారని ఆరోపించారు. తొలుత 45 సెంటర్లని ప్రకటించి ఆ తర్వాత 46 సెంటర్లలో పరీక్షలు నిర్వహించారని, రెండు సెంటర్లల్లో పరీక్షలు రాసిన వారిలో 71 మంది అర్హత సాధించడం వెనుక దాగిన ‘ప్రతిభ’ ఏమిటో తేలాల్సివుందని చెప్పారు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని గ్రూప్‌-1 నియామక ప్రక్రియను నిలిపివేయాలని కోరారు.