వక్ఫ్‌ చట్టబద్ధతపై ‘సుప్రీం’ స్టేటస్‌ కో

వక్ఫ్‌ చట్టబద్ధతపై ‘సుప్రీం’ స్టేటస్‌ కో
వక్ఫ్‌ చట్టబద్ధతపై సుప్రీంకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా వక్ఫ్‌పై సమాధానం ఇచ్చేందుకు కేంద్రం వారం రోజులు గడువు కోరగా సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ కన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథ్‌లతో కూడిన ధర్మాసనం అంగీకరించింది.  బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించిన నేపథ్యంలో కొన్ని దస్త్రాలు దాఖలు చేసేందుకు వారం రోజుల గడువు కావాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోరారు.
అందుకు సమ్మతించిన ధర్మాసనం, ఈ సమయంలో సెంట్రల్‌ వక్ఫ్‌ కౌన్సిల్‌, వక్ఫ్‌ బోర్డులో నియామకాలు జరపరాదని తెలిపింది.  వక్ఫ్‌ ఆస్తులుగా కోర్టులు ప్రకటించిన వాటిని డి-నోటిఫై చేయరాదని కూడా స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం తరఫున విచారణకు హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మోహతా అందుకు అంగీకరించారు. దీంతో సుప్రీం కోర్టు తదుపరి విచారణను వచ్చేనెల 5కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

గ్రామాలకు గ్రామాలను వక్ప్ ఆస్తులుగా, వ్యక్తిగత ఆస్తులను తీసుకున్నారని,  ఇది ప్రజలపై ప్రభావం చూపుతుందని తుషార్ మెహతా తెలిపారు. మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధించాలన్న అభిప్రాయంపై ఆయన స్పందిస్తూ చట్టంపై స్టే విధించడం కఠినమైన నిర్ణయమవుతుందని అభిప్రాయపడ్డారు.  ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా స్పందిస్తూ తాము పరిస్థితి మారిపోవాలని కోరుకోవడం లేదని, ఐదేళ్ల వరకు ప్రొవిజెన్స్‌ ఉన్నాయని తమకు తెలుసుని పేర్కొన్నారు.

వాటిని తాము స్టే చేయబోవడం లేదని స్పష్టం చేశారు. మళ్లీ సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా స్పందిస్తూ తమ వాదనలు వినాలని సీజేఐని కోరారు. మళ్లీ సీజేఐ జోక్యం చేసుకుంటూ తదుపరి విచారణ వరకు ఎలాంటి మార్పులుండొద్దని చెప్పగా, ఎస్‌జీ మెహతా స్పందిస్తూ ఏ రాష్ట్రమైనా నియామకాలు చేస్తే చట్టబద్ధంగా పరిగణించకూడదని చెప్పారు.  ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఎస్‌జీ వ్యాఖ్యలు రికార్డు చేసినట్లు పేర్కొంది. 

కౌన్సిల్‌, బోర్డులో ఎలాంటి నియామకాలు జరుగవని ఎస్‌జీ కోర్టుకు హామీ ఇచ్చారని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. తదుపరి విచారణ వరకు ఎలాంటి నియామకాలు జరగకూడదని, యూజర్ వై వక్ఫ్‌గా పేర్కొన్న వాటితో పాటు నోటిఫికేన్ ద్వారా రిజిస్టర్ అయినవి, డీ నోటిఫై చేయకూడదంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. 

కేసు విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు యథాతథ స్థితి కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ అంశంపై పిటిషన్లు దాఖలు కాగా, అన్నింటిని పరిగణలోకి తీసుకోవడం అసాధ్యమని ధర్మాసనం పేర్కొంది. ఎవరెవరు వాదనలు వినిపించాలో న్యాయవాదులు తమలో తాము నిర్ణయించుకోవాలని, తాము కేవలం ఐదు పిటిషన్లను మాత్రమే విచారిస్తామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.