
నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్లను ప్రస్తావించింది. అలాగే, సీనియర్ కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా, సుమన్ దూబేతో సహా అనేక మంది పేర్లను పేర్కొంది. ఈ వ్యవహారంపై ఈ నెల 25న ప్రత్యేక కోర్టు విచారణ నిర్వహించనున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ అగ్రనేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఛార్జిషీట్ దాఖలు చేయడం ఇదే తొలిసారి. కాగా, హర్యానాలో జరిగిన రియల్ ఎస్టేట్ ఒప్పందంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాను ఈడీ ప్రశ్నించిన కొన్ని గంటల్లోనే చార్జిషీట్ దాఖలు చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా, నేషనల్ హెరాల్డ్ పేపర్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలను ఈడీ గతంలో విచారించింది.
విదేశీ నిధులతో నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపారన్న ఫిర్యాదు మేరకు ఈడీ, సీబీఐ దర్యాప్తు చేపట్టాయి. అయితే, సీబీఐ విచారణ అర్ధాంతరంగానే నిలిచిపోగా, ఈడీ దర్యాప్తు మాత్రం కొనసాగుతూ వస్తుంది. ఇటీవల ఈ కేసులో 2023, నవంబర్లో జప్తు చేసిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఎజెఎల్)కి చెందిన రూ.661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి చర్యలు ప్రారంభించి, నోటీసులు జారీ చేసింది. ఈడీ ఇప్పటి వరకు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్, యంగ్ ఇండియాకు చెందిన దాదాపు రూ.751.9కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది.
ఆయా ఆస్తుల్లో అద్దెకు ఉంటున్న వారు తమకే ఆ మొత్తాన్ని చెల్లించాలని సూచించింది. అక్రమ చలామణి నిరోధక చట్టంలోని సెక్షన్ (8) నిబంధన 5(1) ప్రకారం జప్తు చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియ చేపట్టినట్లు చెప్పింది. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను 1938లో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ స్థాపించారు. దీన్ని అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అంటే ఏజేఎల్ ప్రచురించింది.
2008లో ఆర్థిక సంక్షోభం తర్వాత ఈ వార్తాపత్రిక మూసివేశారు. అయితే, ఇక్కడే ఈ వివాదం ప్రారంభమైంది. దీని తర్వాత 2010లో, యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (వైఐఎల్) అనే కంపెనీ ఏర్పడింది. దీంట్లో దీనిలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ 38-38 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఈ కేసులో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి 2012లో వైఐఎల్ రూ.2 వేల కోట్లకు పైగా విలువైన ఏజేఎల్ ఆస్తులను కేవలం రూ.50 లక్షలకు కోనుగోలు చేసిందని, ఇది మోసమని ఆరోపించారు.
ఇక ఈడీ చార్జిషీట్పై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మరికొందరు నేతలపై చార్జిషీట్ దాఖలు చేయడం అనేది ప్రధానమంత్రి, హోంమంత్రి ప్రతీకార రాజకీయాలకు పాల్పడడం, బెదిరింపులకు ప్రత్నించడమే తప్ప మరొకటి కాదని విమర్శించారు. భారత జాతీయ కాంగ్రెస్, దాని నాయకత్వం మౌనంగా ఉండదు.. సత్యమేవ జయతే! అంటూ ట్వీట్ చేశారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు