మార్కుల కోసం మాతృభాషకు దూరం చేయకండి

మార్కుల కోసం మాతృభాషకు దూరం చేయకండి
మార్కుల కోసం విద్యార్థులను మాతృభాషకు దూరం చేయడం మంచిది కాదని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తెలంగాణ ప్రభుత్వానికి హితవు చెప్పారు. ఇంటర్‌ ద్వితీయ భాషగా సంస్కృతం ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసి విచారం వ్యక్తం చేశారు. మార్కుల దృష్ట్యా ఉంచాలని చూస్తే మాత్రం పునరాలోచన చేయాలని సూచించారు. 
 
సంస్కృతం బోధించడంలో తప్పులేదని, సంస్కృతిని అందిపుచ్చుకునే దిశగా అమ్మభాష ఆలంబనగా నిలుస్తుదని ఆయన చెప్పారు.  “ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ స్థాయిలో ద్వితీయ భాషగా సంస్కృతం అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందన్న వార్తలు విని విచారించాను. మార్కుల దృష్ట్యా ఈ నిర్ణయం అయితే మాత్రం, పునరాలోచన చేయాలని సూచిస్తున్నాను” అని కోరుతూ ఓ ట్వీట్ చేశారు.
 
“విద్యార్థులను మన మాతృభాషకు దూరం చేయడం మంచిది కాదు. సంస్కృతాన్ని బోధించడంలో తప్పు లేదు, అదే సమయంలో మనదైన సంస్కృతిని అందిపుచ్చుకునే దిశగా అమ్మ భాష ఆలంబనగా నిలుస్తుంది. అందుకే జాతీయ విద్యావిధానం- 2020 సైతం మాతృభాషకు ప్రాధాన్యత ఇచ్చింది. ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకుని, విద్యార్థులను మాతృభాషకు మరింత చేరువ చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అని వెంకయ్యనాయుడు ట్వీట్‌ చేశారు.