ఎట్టకేలకు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్

ఎట్టకేలకు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్
బోధన్ మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో షకీల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివిధ కేసుల్లో షకీల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. కాగా కొన్ని నెలలుగా షకీల్‌ దుబాయ్‌లోనే ఉంటున్నారు. ఆయనపై పోలీసులు గతంలో లుకౌట్‌ నోటీసులు కూడా జారీచేశారు.
 
గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షకీల్‌ తల్లి బుధవారం కన్నుమూశారు. గురువారం అచన్‌పల్లిలో జరిగే ఆమె అంత్యక్రియల కోసం షకీల్ హైదరాబాద్‌కు వచ్చారు. మాజీ ఎమ్మెల్యే వస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలోనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు.  షకీల్‌ అమీర్‌ మహమ్మద్‌ గతంలో బీఆర్‌ఎస్‌ తరపున రెండుసార్లు బోధన్‌ ఎమ్మెల్యేగా నెగ్గారు.
 
అయితే తల్లి అంత్యక్రియలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే కోరగా, పోలీసులు అంగీకరించారు. షకీల్ తల్లి అంత్యక్రియలు ముగిసిన వెంటనే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు.  ఇప్పటికే పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో షకీల్‌ను పోలీసులు అరెస్ట్ చేయనున్నారు.

 
2023లో ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన తన కుమారుడిని కేసు నుంచి తప్పించేందుకు తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేశారని షకీల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన తర్వాత తన కుమారుడు రహేల్ దుబాయ్ పారిపోవడానికి షకీల్ సహకరించారని పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. ఈ కేసులో షకీల్ ఏ3గా ఉన్నారు. 
ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ పరారీలో ఉన్నారని హైదరాబాద్ పోలీసులు గతంలో వెల్లడించారు. దీంతో కేసు నమోదు విషయం తెలిసిన షకీల్‌ గత కొంత కాలంగా భారత్ కు రాకుండా దుబాయ్‌లోనే ఉండిపోయారు.  ఇప్పుడు భారత్ కు వచ్చాక ఎయిర్‌పోర్టు అధికారులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు అక్కడకు చేరుకుని షకీల్‌ను అరెస్ట్ చేశారు.
అయితే తల్లి అంత్యక్రియల కోసం మాజీ ఎమ్మెల్యేకు అనుమతించారు పోలీసులు. ఈరోజు సాయంత్రం షకీల్‌ను అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించే అవకాశం ఉంది.