అగ్నిప్రమాదం వల్ల మార్క్‌శంకర్‌ ఊపిరితిత్తుల్లోకి పొగ

అగ్నిప్రమాదం వల్ల మార్క్‌శంకర్‌ ఊపిరితిత్తుల్లోకి పొగ
సింగపూర్‌లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ ఉపముఖ్యమంత్రి  పవన్‌ కల్యాణ్‌ చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌కు గాయాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మీడియాతో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ స్కూల్‌ పిల్లలు సమ్మర్‌ క్యాంప్‌నకు వెళ్లగా అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో తన కుమారుడికి గాయాలు అయినట్లు తెలిపారు. 
 
అరకు పర్యటనలో ఉండగా మార్క్‌శంకర్‌కు గాయాలైనట్లు తనకు ఫోన్‌ వచ్చిందని చెప్పారు. సమ్మర్‌ క్యాంప్‌లో అగ్ని ప్రమాదం జరిగి తన కుమారుడి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయని, ఊపిరితిత్తుల్లోకి పొగ చేరిందని చెప్పారు. ఈ అగ్నిప్రమాదంలో తన కుమారుడు పక్కన కూర్చున్న చిన్నారి మరణించడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
 
సుమారు 30 మంది చిన్నారులు సమ్మర్‌ క్యాంప్‌లో ఉన్నప్పుడు అగ్ని ప్రమాదం జరిగిందని పవన్ కల్యాణ్ తెలిపారు. అగ్నిప్రమాదం చిన్నదే అనుకున్నానని, తర్వాత దాని తీవ్రత తెలిసిందని అన్నారు. నా పెద్ద కుమారుడు అకీరా నందర్ పుట్టిన రోజే రెండో కుమారుడికి ఇలా జరగడం బాధాకరంగా ఉందని పేర్కొన్నారు. 

పొగపీల్చడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. తన భార్య, పిల్లలు సింగపూర్ లోనే ఉంటున్నారని స్పష్టం చేసిన పవన్ కల్యాణ్ వాళ్లున్న చోటికి 10 నిమిషాల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. కాగా, ఈ విష‌యం తెలుసుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మెగాస్టార్ చిరంజీవి, సురేఖ వెంట‌నే సింగ‌పూర్ బ‌య‌లు దేరారు. అరకు పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్. అక్కడ కార్యక్రమాలను ముగించుకుని బుధవారం తెల్లవారుజామున ఒంటిగంటకు సింగపూర్ బయలుదేరారు.

ఈ ఘటన తెలుసుకొని అవసరం అయిన సహాయం చేసేందుకు చాలా మంది ముందుకొచ్చారని, ఈ సమయంలో తనకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మార్క్‌ శంకర్‌ ఆరోగ్యంపై ఆరా తీసిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి లోకేశ్‌, ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు స్పందించిన అందరికీ కృతజ్ఞతలు ఆయన తెలిపారు. మార్క్ శంకర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకూ పవన్ కల్యాణ్, చిరంజీవి దంపతులు సింగపూర్‌లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి.