పెట్రోల్​, డీజిల్​పై ఎక్సైజ్ డ్యూటీ పెంపు

పెట్రోల్​, డీజిల్​పై ఎక్సైజ్ డ్యూటీ పెంపు
 
* పెట్రోల్‌ ధరలో ఎలాంటి మార్పు ఉండదు
 
పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. లీటర్‌పై రూ.2 ఎక్సైజ్‌ డ్యూటీని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా పెట్రోల్​పై ఎక్సైజ్ డ్యూటీ రూ13, డీజిల్​పై రూ.10కి చేరినట్లు వెల్లడించింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత (ఏప్రిల్‌ 8 నుంచి) పెంచిన ఎక్సైజ్‌ డ్యూటీ అమల్లోకి రానున్నట్లు వివరించింది.
 
అయితే ఈ ఎక్సైజ్‌ డ్యూటీ పెంపు భారం సామాన్యులపై ఉండబోదని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఎక్సైజ్‌ సుంకం పెంపును ఆయిల్‌ కంపెనీలే భరిస్తాయని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. సామాన్యులకు పెట్రోల్‌ ధరలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. ఈ మేరకు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌(ఎక్స్‌) వేదికగా క్లారిటీ ఇచ్చింది.
 
కాగా, వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. సిలిండర్ ధరను రూ.50 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉజ్వల గ్యాస్‌ వినియోగదారులకు కూడా ఈ పెంపు వర్తించనుందని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఈ ధ‌ర‌లు రేప‌టి నుంచి అమ‌లులోకి వ‌స్తాయ‌ని పేర్కొంది.

మరోవైపు అమెరికా -చైనా ట్రేడ్‌ వార్‌, ఆర్థిక మాంద్యం భయాలు, ఒపెక్‌ ప్లస్‌ ఉత్పత్తి పెంపు వంటి అంతర్జాతీయ ఆర్థిక భయాల నేపథ్యంలో కొంతకాలంగా క్రూడాయిల్ ధరలు భారీగా పతనం అవుతున్నాయి. వారం వ్యవధిలోనే సుమారు 10 డాలర్ల వరకు తగ్గి.. ఇప్పుడు మూడేళ్ల కనిష్ట సాయికి చేరింది.  అయినప్పటికీ దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి తగ్గింపు జరగలేదు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల తగ్గింపు నేపథ్యంలో ఇప్పటికైనా పెట్రోల్‌ ధరలు తగ్గుతాయేమోనని ఎదురుచూస్తున్న సామాన్యులపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ డ్యూటీ పెంపు పేరుతో షాకిచ్చింది.