రుషికేష్ నుంచి కర్ణప్రయాగ్ వరకు రైలు మార్గం

రుషికేష్ నుంచి కర్ణప్రయాగ్ వరకు రైలు మార్గం

ఇకపై కేదార్‌నాథ్, బద్రీనాథ్ వెళ్లే భక్తులు రైలులో ప్రయాణిస్తూ ఈ పకృతి అందాలను ఆస్వాదించే సదుపాయం కలుగనుంది. ఈ మేరకు రుషికేష్ నుంచి కర్ణప్రయాగ్ వరకు నిర్మిస్తున్న రైలు టన్నెళ్ల పనులు 90 శాతం పూర్తయ్యాయి. మొత్తం 125 కిలోమీటర్ల మేర రైలు మార్గం ఉంటుంది. ఈ మార్గంలో 88 కిలోమీటర్ల మేర ఉండే 8 రెస్క్యూ టన్నెళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. 

ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజ్యసభలో చెప్పుకొచ్చారు. చార్ ధామ్ రైల్వే ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్రభుత్వం రుషికేష్ నుంచి కర్ణప్రయాగ్ వరకు మొత్తం 125 కిలోమీటర్ల పొడవుతో రైలు మార్గం వేస్తుంది. ఈ రైలు మార్గానికి కొండలు అడ్డుగా ఉండటంతో వాటికి రంధ్రాలు చేసి, టన్నెళ్ల ద్వారా మార్గాన్ని ముందుకు తీసుకెళుతోంది. 

రుషికేష్ నుంచి కర్ణప్రయాగ్ వరకు వెళ్లే మార్గంలో ఎక్కువగా టన్నెళ్లే ఉంటాయి. కేదార్‌నాథ్, బధ్రీనాథ్ వెళ్లే భక్తులు రుషికేష్ నుంచి కర్ణప్రయాగ్ వరకు రైలులో ప్రయాణిస్తూ ఓ వైపు పకృతి అందాలను చూస్తూనే,మరో వైపు టన్నళ్లలో థ్రిల్‌కు గురిచేసే అనుభూతిని పొందొచ్చు. అంతేకాదు ఈ రైలు గంగోత్రి, యమునోత్రి మీదుగా కూడా వెళుతుంది.

కాగా, కేదార్‌నాథ్, బధ్రీనాథ్ ఆలయ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు కట్టడి చేస్తూ ఆలయ ప్రాంగణంలోకి వచ్చి వీడియోలు తీసే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ణప్తి చేసింది. అంతేకాకుండా ఎవరైనా ఆలయ ప్రాంగణంలో వీడియో తీస్తూ కనిపిస్తే  దర్శనం లేకుండానే వారిని తిరిగి పంపించనున్నారు. కుంభమేళలో చోటుచేసుకున్న మోనాలిసా సంఘటనతో ఆలయ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.