పాస్టర్‌ ప్రవీణ్‌ మృతిపై విద్వేషపూరిత ప్రసంగం వెనుక కుట్ర!

పాస్టర్‌ ప్రవీణ్‌ మృతిపై విద్వేషపూరిత ప్రసంగం వెనుక కుట్ర!
“ఒక్క క్షణం బైబిల్‌ను పక్కనపెడితే ఊచకోత కోస్తాం. మమ్మల్ని కెలకొద్దు, మేం మంచివాళ్లం కాదు. మూర్ఖులం. మాతో పెట్టుకోవద్దు. ఖబడ్దార్‌! మేము కన్నెర్ర చేస్తే మీరెక్కడుంటారో ఆలోచించుకోండి. మా దగ్గర యుద్ధం చేసే గుంపులూ ఉన్నాయి ఎంతకైనా తెగిస్తాం”. 
 
ఈ విధంగా పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల మరణాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో మత విద్వేషాలు, ఘర్షణలను పురిగొల్పేలా వైఎస్సార్సీపీ నాయకుడు, ఆ పార్టీ క్రైస్తవ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేసిన జాన్‌ బెన్ని లింగం ఇటీవల చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నయి. ప్రవీణ్‌ మృతదేహానికి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం జరుగుతున్న సమయంలో బెన్ని లింగం అక్కడికి చేరుకుని విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారు.

ఈ మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు స్పష్టంగా చెప్పినా ఆయనది హత్యేనంటూ ప్రకటించిన జాన్‌ బెన్ని లింగం అక్కడ గుమికూడిన సమూహాన్ని రెచ్చగొట్టేలా, ఉద్రేకపరిచేలా ప్రసంగించారు. ఆ రోజు అక్కడున్న క్రైస్తవ మతపెద్దలు, పాస్టర్లు, ఫాదర్లు ఎంతో సంయమనంతో శాంతియుతంగా ఉన్నా సరే బెన్ని లింగం మాత్రం విద్వేషపూరితంగా మాట్లాడారు. 

 
అక్కడ చేరిన జనాన్ని హింస వైపు ప్రోత్సహించారు. ఆయన నేపథ్యం, ఆ రోజు చేసిన విద్వేషపూరిత ప్రసంగం వంటివి గమనిస్తే దీని వెనక వైఎస్సార్సీపీ కుట్ర ఉండవచ్చనే అనుమానాలు పోలీసుల్లో వ్యక్తమవుతున్నాయి. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని నెహ్రూనగర్‌కు చెందిన బెన్ని లింగం వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతీరెడ్డిలకు సన్నిహితుడిగా పేర్కొంటున్నారు. 
 
మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు కొడాలి నానికి ప్రధాన అనుచరుడు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి వ్యతిరేకంగా క్రైస్తవుల్ని రెచ్చగొట్టేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మత విద్వేషాలు రెచ్చగొట్టి, వాటిని ప్రభుత్వానికి ఆపాదించటమే పనిగా పెట్టుకున్నారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, హోంమంత్రి అనిత సహా అనేకమందిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. 
 
వివిధ సామాజిక మాధ్యమాల్లోని ఆయన వ్యక్తిగత ఖాతాల్ని పరిశీలిస్తే ఇది స్పష్టమవుతుంది.  అసోసియేషన్‌ ఆఫ్‌ ఇంటిగ్రేటెడ్‌ క్రిస్టియన్‌ కౌన్సిల్‌ (ఏఐసీసీ) వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా చెప్పుకొనే జాన్‌ బెన్ని లింగం వైఎస్సార్సీపీ కార్యకర్త. 2024 ఎన్నికల్లో అనేక నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. 
 
‘దైవ సేవకుల ఆత్మీయ సమ్మేళనాలు’ పేరిట ఎక్కడికక్కడ సమావేశాల్లో పాల్గొని క్రైస్తవులంతా జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతివ్వాలంటూ కోరారు. జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వై.ఎస్‌.భారతీరెడ్డితో కలిసి పులివెందులలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.