భారత్‌పై 26 శాతం, చైనాపై 34 శాతం సుంకాలు

భారత్‌పై 26 శాతం, చైనాపై 34 శాతం సుంకాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లిబరేషన్ డే పేరుతో పలు దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించారు. ఈ నిర్ణయం ఏప్రిల్ 2 అర్ధరాత్రి నుంచి (అమెరికా కాలమానం ప్రకారం) అమలులోకి వస్తుందని తెలిపారు. తమపై ఇతర దేశాలు విధిస్తున్న సుంకాల్లో సగమే తాము విధిస్తున్నామని ఆయన తెలిపారు. భారత్‌పై 26 శాతం, చైనాపై 34 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.

ఐరోపా యూనియర్: 20 శాతం,  తైవాన్‌: 32 శాతం, జపాన్‌: 24 శాతం, దక్షిణ కొరియా: 25 శాతం, థాయిలాండ్‌: 36 శాతం, స్విట్జర్లాండ్‌: 31 శాతం, ఇండోనేషియా: 32 శాతం, మలేషియా: 24 శాతం, కాంబోడియా: 49 శాతం, యూకే: 10 శాతం, దక్షిణాఫ్రికా: 30 శాతం, బ్రెజిల్‌: 10 శాతం, బంగ్లాదేశ్‌ 37 శాతం, సింగపూర్‌: 10 శాతం, ఇజ్రాయెల్: 17 శాతం, ఫిలిఫ్ఫీన్స్‌: 17 శాతం, చిలీ: 10 శాతం, ఆస్ట్రేలియా: 10 శాతం, పాకిస్థాన్‌: 29 శాతం, టర్కీ: 10 శాతం, శ్రీలంక: 44 శాతం, కొలంబియా: 10 శాతం చొప్పున సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించారు.
తమపై భారీగా సుంకాలు విధించే దేశాలపై తప్పకుండా సుంకాలు విధిస్తామని ఆయన హెచ్చరించారు.  ప్రతీకార సుంకాలు విధించడానికి గల కారణాలను కూడా ట్రంప్ వివరించారు. “అమెరికా భవిష్యత్తు అమెరికన్ల చేతుల్లోనే ఉంది.. ఇతర దేశాలు తమపై విధిస్తున్న సుంకాల్లో సగమే తాము విధిస్తున్నాం.. ఆయా దేశాలపై దయతోనే మేము ఇలా చేశాం.. అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని దేశాల ఉత్పత్తులపై కనీసం 10 శాతం టారిఫ్‌లు విధిస్తున్నాం” అని ప్రకటించారు. 
 
అమెరికా ఇండస్ట్రీ ఈరోజు పునర్జన్మించినట్లు అయిందని పేర్కొంటూ యూఎస్‌ మళ్లీ సుసంపన్నమైన దేశంగా అవతరించిన రోజుగా గుర్తుండబోతుందని స్పష్టం చేశారు. తమ టాక్స్‌ పేయర్లను గత 50 ఏళ్లుగా దోచుకున్నారని ఆరోపిస్తూ, ఇక అది జరగదని తేల్చి చెప్పారు. “మాపై సుంకాలు విధించే దేశాలపై తప్పకుండా సుంకాలు విధిస్తాం.. అమెరికాకు ఈ రోజు నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చింది.. సుంకాల ప్రకటనతో అమెరికాలో మళ్లీ పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి” అని ప్రకటించారు. 
 
కంపెనీలు తిరిగి వెనక్కి వస్తాయని, విదేశీ మార్కెట్లకు ద్వారాలు తెరుస్తామని ఆయన చెప్పారు. అమెరికాలో పోటీతత్వం పెరిగి సరసమైన ధరల్లో వస్తువులు లభిస్తాయని, దీంతో అమెరికాలో మళ్లీ స్వర్ణయుగం మొదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  అనేక దేశాలు అమెరికా మేధో సంపత్తిని దొంగిలించాయని,  పలు దేశాలు అన్యాయమైన విధానాలను అవలంభించాయని ట్రంప్ ఆరోపించారు.
 
అమెరికా దిగుమతి చేసుకున్న మోటారు సైకిళ్లపై 2.4 శాతం సుంకాలు విధిస్తోందని ఆయన గుర్తు చేశారు. థాయిలాండ్, ఇతర దేశాలు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న ద్విచక్రవాహనాలపై 60 శాతం, భారత్ 70 శాతం, వియత్నాం 75 శాతం సుంకాలు విధిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు.  వాణిజ్య విషయానికి వచ్చినప్పుడు కొన్నిసార్లు స్నేహితుడు సైతం శత్రువు కంటే ప్రమాదకరమని ట్రంప్ పేర్కొన్నారు. 
 
దక్షిణ కొరియాలో తయారవుతున్న కార్లు 80 శాతం అక్కడే అమ్ముడవుతున్నాయని, జపాన్‌లో తయారవుతున్న కార్లు అక్కడే 90 శాతం అమ్ముడుపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. అదే అమెరికాలో తయారవుతున్న కార్లు ఇక్కడ తక్కువ సంఖ్యలోనే అమ్ముడవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అమెరికాకు చెందిన ఫోర్డు కార్లు ఇతర దేశాల్లో చాలా పరిమిత సంఖ్యలో అమ్మకాలు జరుగుతున్నాయని ట్రంప్ చెప్పారు. ఈ అసమతౌల్యత అమెరికాకు నష్టం తెస్తోందని ఆయన తెలిపారు. అందుకే అన్ని విదేశీ తయారీ ఆటోమొబైల్స్‌పై 25 శాతం సుంకాలు ఈ అర్ధరాత్రి నుంచి విధించనున్నట్లు ఆయన ప్రకటించారు.
అమెరికాను ఇతర దేశాలు చెడుగా చూపిస్తున్నాయని, దిగుమతులపై అసమానమైన సుంకాలు విధించాయని ట్రంప్ ఆరోపించారు.
 
అమెరికాలో ఉత్పత్తులు తయారుచేసే కంపెనీలపై ఎలాంటి సుంకాలు వసూలు చేయమని అధ్యక్షుడు స్పష్టం చేశారు. తాను ప్రతీకార సుంకాల ప్రతిపాదన తేవడంతో అనేక దేశాల పాలకులు, రాయబారులు స్పందించారని ట్రంప్ చెప్పారు. సుంకాలపై మినహాయింపులు కోరారని ఆయన చెప్పారు. అయితే మీరు సుంకాలు తగ్గిస్తేనే తాను తగ్గిస్తానని చెప్పానని ఆయన పేర్కొన్నారు. 
 
కరెన్సీని మార్చుకోవద్దని, బిలియన్‌ డాలర్ల అమెరికా వస్తువులను కొనాలని చెప్పానని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీ గురించి కూడా ట్రంప్ మాట్లాడారు. మోదీ తనకు గొప్ప స్నేహితుడని, అయితే భారత్ అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదని ఆయన విమర్శించారు. భారత్ అమెరికా వస్తువులపై 52 శాతం సుంకాలు విధిస్తోందని ట్రంప్ ఆరోపించారు.