మణిపూర్‌లో ఎప్పటి నుంచో శరణార్థులు

మణిపూర్‌లో ఎప్పటి నుంచో శరణార్థులు

1960ల నుంచే వేలాది మంది శరణార్థులు మణిపూర్‌లో స్థిరపడ్డారని, ఆ ప్రజలకు అప్పటి ప్రభుత్వమే పునరావాసం కల్పించడానికి సహాయమందించిందని మణిపూర్‌ మాజీ ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. మరి ఎప్పటి నుంచో ఉంటున్న అప్పటి శరణార్థుల కుటుంబాలు ఏమయ్యాయి? వారిని ఓటర్ల జాబితాలో చేర్చారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

తాజాగా మణిపూర్‌లోని బిజెపి ఎమ్మెల్యేలు శరణార్థుల గురించి స్పందిస్తూ రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సి అమలుచేసే ముందు, డిలిమిటేషన్‌ ప్రక్రియ చేపట్టేముందు 2001 నాటి జనాభాల లెక్కల్ని సమీక్షించాలని కోరారు. బిజెపి నేతల వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘మణిపూర్‌ 1970కి ముందు కేంద్రపాలిత ప్రాంతంగా ఉండేది. 1972 జనవరి 21న ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. పూర్తిస్థాయి రాష్ట్రంగా ఏర్పడకముందే అంటే.. 1960.. 1970ల ప్రారంభంలో వేలాది మంది శరణార్థులు రాష్ట్రంలో స్థిరపడ్డారు. వారికి పునరావాసం కోసం ప్రభుత్వమే సహాయమందిచినట్లు అధికారిక పత్రాలు వెల్లడిస్తున్నాయి’ అని తెలిపారు. 

మరి అన్నివేల కుటుంబాలు ఇప్పుడేమయ్యాయి? వారు ఈ రాష్ట్ర ప్రజలలో కలిసిపోయారా? అప్పటి నుండి ఎన్నితరాలు పెరిగాయి? ఇప్పటికైనా వారికి పూర్తి హక్కులు లభించాయా? ఈ ప్రశ్నలు ప్రజాక్షేత్రంలో ఎప్పుడూ పూర్తిగా పరిష్కరించబడలేదని బీరెన్ సింగ్ తెలిపారు. రాష్ట్రంలో జనాభా నిర్మాణం సంవత్సరాలుగా మారినప్పటికీ ఈ సమస్యను ఎక్కవగా మాట్లాడలేదని ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు. 

1967 నాటికి మణిపూర్‌లో 15,00ల కంటే ఎక్కువ శరణార్థ కుటుంబాలు ఉన్నాయని అప్పటి మణిపూర్‌ ఎంపి పావోకై హవోకిప్‌ హోం వ్యవహరాల సహాయ మంత్రి కె.సి పంత్‌కు రాసిన లేఖను బీరెన్‌సింగ్‌ ఈ పోస్టుకి జత చేశారు. రాష్ట్రంలో శరణార్థుల సమస్య తీవ్రతను తెలియజేసే అనేక ఉత్తర ప్రత్యుత్తరాలలో పావోకై రాసిన లేఖ ఒకటని బీరెన్‌ ఉదహరించారు.

శరణార్థులకు మణిపూర్‌ డంపింగ్‌ గ్రౌండ్‌గా ఉంది. మరి ఈ రాష్ట్రంలో ఉంటున్న ఈ వ్యక్తులు శరణార్థి హోదాలో ఉండేందుకు చట్టపరమైన యంత్రాంగాలు ఉన్నాయా? అని ప్రశ్నించడం ముఖ్యం అని తెలిపారు. శరణార్థుల సమస్య మన సమాజాన్ని, సామాజిక సమత్యులపై ప్రభావం పడుతుంది. ఈ సమస్య విస్తృతమైన పరిణామాలను కలిగి ఉంది. రాష్ట్ర వర్తమానాన్ని, భవిష్యత్తును ఈ సమస్యే నిర్దేశిస్తుంది అని బీరెన్‌ సింగ్‌ పోస్టులో పేర్కొన్నారు.

2023 మేలో చెలరేగిన జాతి హింసకు మయన్మార్‌ నుండి వచ్చిన అనేక మంది అక్రమ వలసదారులే కారణమని కేంద్రం, బీరెన్‌ సింగ్‌ ఆరోపించారు. ఈ జాతి హింస వల్ల 250 మందికిపైగా మృతి చెందిన విషయం తెలిసిందే.