హెచ్‌సీయూ భూముల వేలంపై కేంద్రం జోక్యం కోరిన బీజేపీ

హెచ్‌సీయూ భూముల వేలంపై కేంద్రం జోక్యం కోరిన బీజేపీ
 
* రాజ్యసభలో ప్రస్తావించిన డా. లక్ష్మణ్… బిజెపి ఎమ్యెల్యేల హౌస్ అరెస్ట్
యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ (హెచ్‌సీయూ)కు చెందిన 400 ఎకరాల భూమిని వేలం వేసేందుకు సిద్దమవుతున్న తెలంగాణ ప్రభుత్వాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు కోరారు.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కంచె గచ్చిబౌలి భూములపై కేంద్ర మానవ వనరుల అభివ్రుద్ధి శాఖ మంత్రి  ధర్మేంద్ర ప్రదాన్ ను కలిసిన మంగళవారం కలిసి ఈ విషయమై చర్చించారు.
 
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, నగేశ్ ధర్మేంద్ర ప్రధాన ను కలిసి పర్యావరణ పరిరక్షణ కాపాడటంతో పాటు హెరిటేజ్ భూములను రక్షించేందుకు కేంద్రం తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ పర్యావరణ పరిరక్షణ సమతుల్యతకు కంచె గచ్చిబౌలి భూములు ఎంతో ప్రయోజనకరం అని తెలిపారు. 

700 రకాల ఔషధ మొక్కలు, 220 రకాల పక్షులతో ఆ ప్రాంతమంతా అలరారుతోందని చెబుతూ  ఈ భూములను రియల్ ఎస్టేట్ గా మార్చి వేల కోట్లు దండుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తున్నదని ఆరోపించారు. హెచ్ సీయూ విద్యార్థులతోపాటు యావత్ హైదరాబాద్ ప్రజలంతా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. తక్షణమే గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని అమ్మే ప్రక్రియను రాజ్యసభలో బిజెపి సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రస్తావించారు.  ఈ భూమిని అమ్మడం వల్ల, విద్యార్థుల కోసం అనివార్యమైన వనరులు నష్టపోతారని, ఇది పర్యావరణానికి కూడా హానికరమైనదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భూమిని విద్యార్థుల కోసం రక్షించడమే కాకుండా, రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు అవసరమైన వనరులు కాపాడేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
మరోవంక, హెచ్‌సీయూ భూములను చూసేందుకు బయలుదేరిన బీజేపీ శాసనసభ్యులను వారి నివాసాల వద్దనే కట్టడి చేస్తూ పోలీసులు అడ్డుకున్నారు. హెచ్‌సీయూ సందర్శనకు పిలుపునిచ్చిన బీజపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. వివిధ జిల్లాల నుంచి హెచ్‌సీయూ సందర్శనకు బయల్దేరిన పలు యువజన, విద్యార్థి విభాగాల నాయకులను కూడా పోలీసులు ఎక్కడిక్కడే అడ్డుకున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం గత కొన్ని రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో వందల జేసీబీలు ఉపయోగించి చెట్లను నరికి, భూములను అమ్మే ప్రయత్నం చేస్తోందని బిజెపి ఎమ్యెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త  విమర్శించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వెచ్చించి పరిశోధన కేంద్రాలు స్థాపిస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అనేక ప్రాజెక్టులకు భూములు కేటాయించలేకపోతోందని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలోని భూములను ఇలా అమ్మేస్తే భవిష్యత్‌లో అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూములు ఎక్కడి నుంచి కేటాయిస్తారు? అని ఆయన ప్రశ్నించారు.
గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కోకాపేట భూములను తాకట్టుపెట్టగా ఇప్పుడు రేవంత్ రెడ్డి, కేసీఆర్‌ను మించి భూములను అమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ భూములను విద్యార్థుల భవిష్యత్తు కోసం లైబ్రరీలు, కమ్యూనిటీ హాళ్లు, ఆసుపత్రులు, స్కూళ్ల కోసం ఉపయోగిస్తామని గతంలో రేవంత్ రెడ్డి చెప్పారని ఆయన గుర్తు చేసారు. కాని ఇప్పుడు అవే భూములను అమ్మాలని ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.  ఇలా భూములను ఇష్టానుసారంగా అమ్ముతూ పోతే పర్యావరణానికి, విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇలా ఉండగా, గచ్చిబౌలిలోని సర్వే నంబరు 25లో 400 ఎకరాలపై యాజమాన్య హక్కులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానివేనని రెవేమీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో వేసిన వ్యాజ్యాలపై పోరాడి కాంగ్రెస్‌ ప్రభుత్వం హక్కులు దక్కించుకుందని పేర్కొన్నారు. ఈ భూమిలో ఒక్క అంగుళం కూడా హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందినది లేదని తేల్చి చెప్పారు.