బెట్టింగ్‌ యాప్స్‌ వ్యవహారంపై సిట్‌

బెట్టింగ్‌ యాప్స్‌ వ్యవహారంపై సిట్‌
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఈమేరకు డీజీపీ జితేందర్‌ ఆదేశాలు జారీచేశారు. సీఐడీ అదనపు డీజీ పర్యవేక్షణలో సిట్‌ దర్యాప్తు చేపట్టనుంది. ఇందులో ఐజీ ఎం.రమేష్‌తోపాటు ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రకాంత్, శంకర్‌లను సభ్యులుగా నియమించారు. 90 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని ఆదేశించారు.

బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్స్‌పై ఇప్పటికే రెండు కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ పంజాగుట్టతోపాటు సైబరాబాద్ మియాపూర్‌లో కేసులు నమోదైన విషయం తెలిసిందే. టాలీవుడ్, బాలీవుడ్ నటులతోపాటు యూట్యూబర్స్, టీవీ యాంకర్లు 25 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ రెండు కేసులను కూడా సిట్‌కు బదిలీ చేశారు.

ఈ దర్యాప్తుతో బెట్టింగ్ యాప్స్ వెనుక ఉన్న అసలు నెట్‌వర్క్‌ను బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసు లో పలువురు సినీ ప్రముఖులు, టీవీ యాక్టర్లు.. సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లు ఉన్నారు. వీరికి నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్దమైంది. ఈ యాప్స్ ను ప్రమోట్ చేసే వారిని ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్స్‌ వ్యవహారం టాలీవుడ్‌ను కుదిపేస్తున్నది. ఇప్పటికే పలువురు నటీనటులపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇటీవల ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. సీనియర్‌ నటుడు నందమూరి బాలకృష్ణ, ప్రభాస్‌, గోపీచంద్‌లపై కూడా కేసులు నమోదయ్యాయి. ఇమ్మాని రామారావు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

ముగ్గురు నటులు బెట్టింగ్‌ యాప్స్‌ని ప్రమోట్‌ చేసినట్లుగా ఆరోపించారు. ఓ టాక్‌ షోలో పాల్గొన్న సమయంలో అక్రమ బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌ నిర్వహించినట్లు ఆయన ఆరోపించారు. టాక్‌లో బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించగా, స్పెషల్‌ ఎపిసోడ్‌లో ప్రభాస్‌, గోపీచంద్‌ కనిపించారు.