అత్యాచారం ఆరోపణలపై డైరెక్టర్‌ సనోజ్‌ మిశ్రా అరెస్ట్‌

అత్యాచారం ఆరోపణలపై డైరెక్టర్‌ సనోజ్‌ మిశ్రా అరెస్ట్‌
ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభమేళా ద్వారా ఫేమస్ అయిన పూసలమ్ముకునే అమ్మాయి మోనాలిసాకు సినిమా ఆఫర్‌ ఇచ్చిన దర్శకుడు సనోజ్‌ మిశ్రా అరెస్ట్‌ అయ్యారు. పెళ్లి చేసుకుంటాను, హీరోయిన్‌గా అవకాశం కల్పిస్తానని నమ్మబలికి ఓ యువతిపై పలు మార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు సనోజ్ మిశ్ర. మాట వినకపోతే తమ అసభ్య వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. 
 
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు డైరెక్టర్‌ను అరెస్ట్ చేశారు.  యూపీ ఝాన్సీ నగరానికి చెందిన ఓ యువతి సనోజ్‌ మిశ్రాపై ఈ సంచలన ఆరోపణలు చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, 2020లో డైరెక్టర్‌తో ఇన్‌స్టా, టిక్‌టాక్‌ ద్వారా తనకు పరిచయం ఏర్పడినట్లు తెలిపింది. ఆ తర్వాత ఇద్దరం తరచుగా మాట్లాడుకునే వాళ్లమని, అలా జూన్‌ 17, 2021లో తాను ఝాన్సీ రైల్వే స్టేషన్‌లో ఉన్నానని మిశ్రా తనకు ఫోన్‌ చేసినట్లు చెప్పింది.
అయితే, ఆయన్ని కలిసేందుకు తాను నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని ఆరోపించింది. అతడి బెదిరింపులకు భయపడిపోయిన తాను తర్వాతి రోజు కలిసేందుకు ఒప్పుకున్నట్లు చెప్పింది.  జూన్‌ 18, 2021న తనని ఓ రిసార్ట్‌కు తీసుకెళ్లి, అక్కడ మత్తుమందు ఇచ్చి తనపై దాడి చేసినట్లు ఆరోపించింది. ఆ సమయంలో వీడియోలు కూడా రికార్డ్‌ చేసినట్లు చెప్పింది. ఆ వీడియోలతో తనను బెదిరించి అనేకసార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సనోజ్‌ మిశ్రాను ఢిల్లీలో అరెస్ట్‌ చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది.

ప్రయాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న మ‌హా కుంభ‌మేళాలో మోనాలిసా అనే అమ్మాయి వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ఓ చిన్న పల్లెటూరు నుంచి పూసలు అమ్ముకోవ‌డానికి మహాకుంభమేళాకు వచ్చింది మోనాలిసా. అయితే తన వ్యాపారం బాగా జ‌రుగుతుందనుకుంటే ఒక నెటిజ‌న్ ఆమె ఫొటో తీసి సోష‌ల్ మీడియాలో పెట్టాడు. 

దీంతో రాత్రికి రాత్రే వైర‌ల్‌గా మారింది మోనాలిసా. తన తేనె కళ్లు, అందం, చిరునవ్వుతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. దీంతో కుంభ‌మేళాకి వెళ్లిన వారు ఆమెతో ఫొటో దిగ‌డానికి ఆస‌క్తిచూపించ‌డం, ఫొటోల పేరుతో ఆమెను ఎక్కడ‌ప‌డితే అక్కడ తాక‌డం వివాదానికి దారి తీసింది. దీంతో త‌న పూస‌ల బిజినెస్‌ వ‌దిలేసి త‌న గ్రామంకి వెళ్లిపోయింది.

మోనాలిసా ప‌రిస్థితి తెలుసుకున్న బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమె ఫొటోలు చూసి హీరోయిన్‌గా అవ‌కాశం ఇస్తాన‌ని ప్రకటించాడు. మ‌ణిపూర్ నేప‌థ్యంలో రాబోతున్న ‘ది డైరీ ఆఫ్‌ మణిపూర్‌’ మూవీకి సంత‌కం కూడా చేసింది మోనాలిసా. ఈ సినిమా కోసమే ప్రస్తుతం యాక్టింగ్‌పై ట్రెయినింగ్ కూడా తీసుకుంటోంది. ఇక మోనాలిసాకి సంబంధించిన అన్ని పనుల‌ను సనోజ్‌ మిశ్రానే ద‌గ్గరుండి చూసుకుంటున్నాడు.

దీంతో సనోజ్ మిశ్రా  మోనాలిసాతో క్లోజ్‌గా ఉండటంపై బాలీవుడ్ నిర్మాత జితేంద్ర నారాయణ్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సనోజ్ మిశ్రాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సనోజ్ మోనాలిసాను ప్రచారం కోసం వాడుకుంటున్నారని, ఆమెను ట్రాప్ చేస్తున్నారని, తప్పుదారి పట్టిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన వ్యాఖ్యల‌పై సనోజ్ మిశ్రా స్పందిస్తూ మోనాలిసా నా కూతురు లాంటిద‌ని తెలిపాడు. 

“ఆమె నా కూతురు వ‌య‌సు ఉంటుంది. నేను ఆమెను వేధించట్లేదు. ఆమె ఇష్టపూర్వకంగానే సినిమాలో న‌టిస్తుంది. మోనాలిసా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆమెను నేనే యాక్టింగ్ నేర్పిస్తున్నాను. ఇది తప్పుదోవ పట్టించడం కాదు. త‌న‌కి యాక్టింగ్ వ‌చ్చింది అన్నప్పుడు సినిమా  ప్రారంభిస్తాను” అని ప్రకటించాడు.  మిశ్రా  గాంధీగిరి, రామ్ కి జన్మభూమి, లఫంగే నవాబ్, కాశీ టూ కశ్మీర్ వంటి సినిమాలను తెరకెక్కించాడు.