సొంత టెలికాం టెక్నాలజీ కలిగిన దేశాల సరసన భారత్‌

సొంత టెలికాం టెక్నాలజీ కలిగిన దేశాల సరసన భారత్‌
సొంత టెలికాం టెక్నాలజీ కలిగిన దేశాల సరసన భారత్‌ చేరిందని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. భారత్‌ కన్నా ముందు చైనా, ఫిన్లాండ్‌, స్వీడన్‌, దక్షిణా కొరియా మాత్రమే ఈ టెక్నాలజీ ఉందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా టెలికాం కంపెనీలు విలీనవుతున్నాయని చెబుతూ భారత్‌లో నాలుగు కంపెనీలు ఉన్నాయని గుర్తు చేశారు. 
 
2014లో 90 కోట్ల మంది మొబైల్‌ కస్టమర్స్‌ ఉండగా, నేడు ఈ సంఖ్య 1.2 మిలియన్లకు పైగా పెరిగిందని చెప్పారు. అప్పుడు 25 కోట్ల మంది ఇంటర్నెట్‌కు కనెక్ట్‌ అయ్యారని, ప్రస్తుతం 97కోట్ల మంది ఇంటర్నెట్‌ యూజర్లు ఉన్నట్లు తెలిపారు. 2014లో ఆరు కోట్ల మందికి బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ ఉందని, ఆ సంఖ్య నేడు 94 కోట్లకు చేరుకుందని పేర్కొంటూ ఇది అమెరికా మొత్తం జనాభా కంటే ఎక్కువ అని తెలిపారు.
 
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) దేశవ్యాప్తంగా లక్ష స్వదేశీ 4జీ మొబైల్‌ టవర్లను ఏర్పాటు చేస్తోందని, వీటిని 5జీగా మారుస్తామని మంత్రి చెప్పారు. ఈ పని జూన్‌ నాటికి పూర్తవుతుందని చెబుతూ ఆత్మనిర్భర్‌ భారత్‌ యోజన కింద జరుగుతోందని తెలిపారు. ప్రభుత్వం డైరెక్ట్-టు-డివైస్ (డిటిడి) ఉపగ్రహ సేవలను ప్రారంభించిందని సింధియా చెప్పారు. 
 
ఈ సాంకేతికతలో నెట్‌వర్క్‌కు కనెక్ట్ కానప్పుడు కూడా స్మార్ట్‌ఫోన్ నుంచి సందేశాలను పంపొచ్చని తెలిపారు. అప్పుడు కనెక్టివిటీ మొబైల్ టవర్ నుంచి కాకుండా ఉపగ్రహం నుంచి నేరుగా అందుతుందని పేర్కొన్నారు. ఎలాన్‌ మస్క్ స్టార్‌లింక్ భారతదేశంలో ఉపగ్రహ కమ్యూనికేషన్ సేవలను ప్రారంభించడానికి దరఖాస్తు చేసుకోవడమే కాకుండా, ఇతర అనేక కంపెనీలు సైతం ఆసక్తిని చూపించాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. 
 
ఉపగ్రహ కమ్యూనికేషన్ సేవల కోసం ఇప్పటికే రెండు కంపెనీలకు లైసెన్స్‌లు ఇచ్చామని సింధియా చెప్పారు. ఇందులో ఒకటి రిలయన్స్‌, మరొకటి భారతీ ఎయిర్‌టెల్‌కు జారీ చేసినట్లు వివరించారు.