అత్యాచారం కేసులో దోషిగా పాస్టర్‌ బాజిందర్‌ సింగ్‌

అత్యాచారం కేసులో దోషిగా పాస్టర్‌ బాజిందర్‌ సింగ్‌
పంజాబ్‌ కు చెందిన సెల్ఫ్‌ స్టైల్డ్‌ క్రిస్టియన్‌ పాస్టర్‌ బాజిందర్‌ సింగ్‌ అత్యాచారం కేసులో దోషిగా తేలాడు. ‘యేసు యేసు ప్రాఫెట్‌’ గా సింగ్‌ పాపులర్‌ అయ్యాడు. బాజిందర్‌ సింగ్‌ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు 2018లో పంజాబ్‌లోని జిరాక్‌పూర్‌ కు చెందిన ఓ మహిళ ఆరోపించింది. విదేశాలకు తీసుకెళ్తానని మాయమాటలు చెప్పి బాజిందర్‌ తనను శారీరకంగా వాడుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దాంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆయనతోపాటు మొత్తం ఏడుగురిపై ఈ కేసులో అభియోగాలు నమోదయ్యాయి. శుక్రవారంఈ కేసు విచారణ జరిపిన ట్రయల్‌ కోర్టు బాజిందర్‌ సింగ్‌ను దోషిగా తేల్చింది. కేసులో అభియోగాలు మోస్తున్న మిగతా ఆరుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. బాజిందర్‌ సింగ్‌కు ఏప్రిల్‌ 1న శిక్ష ఖరారు చేయనున్నట్లు తెలిపింది.

కాగా బాజిందర్‌ సింగ్‌ తరచూ వివాదాల్లో ఉంటుంటాడు. ఇటీవల ఆయన తన కార్యాలయంలో ఓ మహిళపైన, మరో వ్యక్తిపైన దాడికి పాల్పడిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. వారిని చెంపలపై కొట్టడం, చేతికి ఏది దొరికితే అది విసరడం లాంటి దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి.  2022లో ఓ 22 మహిళ సింగ్‌ తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది. 2022లోనే అనారోగ్యంతో ఉన్న ఓ మహిళను బాగుచేస్తానని చెప్పి ఆమె కుటుంబం నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు. కానీ ఆమె మరణించింది.