పునర్విభజనకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి తీర్మానం

పునర్విభజనకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి తీర్మానం
లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌కు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అంగీక‌రించ‌మ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతితో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీలిమిటేషన్‌పై రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోకపోవడాన్ని సభ తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు. 

పునర్విభజనతో జనాభా త‌గ్గిన‌ రాష్ట్రాలు నష్టపోకూడదని స్పష్టం చేయసారు. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలను మాత్రమే కొనసాగించాలని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తాము డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత జనాభాను ప్రాతిపదికగా తీసుకుని ఎస్సీ, ఎస్టీ సీట్లను కూడా పెంచాల్సిన అవశ్యకత ఉందని చెప్పారు.1971లో రాజ్యాంగ సవరణతో డీలిమిటేసన్ ప్రక్రియను 25 ఏళ్లుగా నిలిపేశారని సభ దృష్టి తీసుకొచ్చారు. ప్రస్తుతం పునర్విభజనపై నేటికి అదే గందరగోళం నెలకొందని చెబుతూ ఇటీవ‌ల తమిళనాడులో సీఎం స్టాలిన్ సమావేశం ఏర్పాటు చేశారని, జనాభా ఆధారంగా చేసే నియోజకవర్గాల పునర్విభజనను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని తీర్మానం చేశామని గుర్తు చేశారు. 

జనాభా ఆధారంగా చేసే నియోజకవర్గాల పునర్విభజనను వాజ్‌పేయ్ కూడా వ్యతిరేకించారని, కానీ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను సంప్రదించకుండానే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ప్రక్రియను చేపడుతోందని ఆరోపించారు. పునర్విభజనపై సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ కొందరు కామెంట్ చేస్తున్నారని, కానీ జనాభా నియంత్రణపై కేంద్రం ఆదేశాలను దక్షిణాది రాష్ట్రాలు పాటించాయని, ఉత్తరాది రాష్రాలు జనాభాను నియంత్రించ లేదని విమర్శించారు. 

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రయోజనం కోసం జమ్ముకశ్మీర్‌, అసోంలో అసెంబ్లీ నియోజవర్గాలను పెంచారని, కానీ, ఏపీ పునర్విభజన చట్టంలో అసెంబ్లీ సీట్లను పెంచాలని స్పష్టం పేర్కొన్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవట్లేదని ధ్వజమెత్తారు. దక్షిణాది రాష్ట్రాలకు ప్రస్తుతం లోక్‌సభలో 24 శాతం ప్రాతినిధ్యం ఉందని, ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం 19 శాతానికి పడిపోతుందని ఆందోళన వ్య‌క్తం చేశారు.