బెల్జియం ప్రభుత్వం పరిశీలనలో మొహుల్‌ చోక్సీ కేసు

బెల్జియం  ప్రభుత్వం పరిశీలనలో మొహుల్‌ చోక్సీ కేసు

పరారీలో ఉన్న భారత వ్యాపారవేత్త మొహుల్‌ చోక్సీ కేసును బెల్జియం  ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని ప్రభుత్వ  ప్రతినిధి పేర్కొన్నారు. మొహుల్‌ చోక్సీ కేసును గణనీయమైన శ్రద్ధతో నిర్వహిస్తోందని ఫెడరల్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌ (ఎఫ్‌పిఎస్‌) విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి, ప్రెస్‌ సర్వీస్‌ హెడ్‌ డేవిడ్‌ జోర్డెన్స్‌ పేర్కొన్నారు.  

వ్యక్తిగత కేసుల గురించి వ్యాఖ్యానించలేమని, ఈ కేసు ఎఫ్‌పిఎస్‌ అధికార పరిధి కిందకు వస్తుందని అన్నారు. అయితే చోక్సీ బెల్జియంలో ఎక్కడ ఉన్నారనే వివరాలను ఆయన అందించలేదు. బెల్జియం అధికారులు కేసును పరిశీలిస్తున్నారని, పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు అందిస్తారని పేర్కొన్నారు.

అయితే చోక్సీ  గురించి గతంలో   ఆంటిగ్వా మరియు బార్బుడా విదేశాంగ మంత్రి ఇ.పి.చెట్‌గ్రీన్‌ ప్రస్తావించారు. చోక్సీ విదేశాలలో వైద్య చికిత్స కోసం తమ దేశం విడిచి వెళ్లారని, కానీ ఇక్కడి పౌరుడిగానే ఉన్నారని స్పష్టం చేశారు. ఈ అంశంపై డేవిడ్‌ జోర్డెన్స్‌ మాట్లాడుతూ చోక్సీ విషయంలో ఇరు ప్రభుత్వాలు సంయుక్తంగా పనిచేస్తున్నాయని తెలిపారు. 

ఇరు దేశాలు న్యాయవ్యవస్థను గౌరవిస్తాయని, మొహుల్‌ చోక్సీ కేసు చట్టపరమైన సమీక్షకు లోబడి ఉందని చెప్పారు. మొహుల్‌ చోక్సీ. అతని మేనల్లుడు నీరవ్‌ మోడీలు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పిఎన్‌బి)ని రూ.14,000 కోట్లకు పైగా రుణాన్ని ఎగవేసి, విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే.