మాజీ సీఎం భూపేశ్‌ బఘేల్‌ నివాసంలో సీబీఐ సోదాలు

మాజీ సీఎం భూపేశ్‌ బఘేల్‌ నివాసంలో సీబీఐ సోదాలు
ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత భూపేశ్‌ బఘేల్‌ చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో ఆయన ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ ముడుపుల కేసులో సీబీఐ అధికారులు మాజీ సీఎం నివాసంలో దాడులు నిర్వహిస్తున్నారు.
 
రాయ్‌పూర్‌, భిలాయ్‌లోని ఆయన నివాసాలతోపాటు బంధువులు, ఓ సీనియర్‌ పోలీసు అధికారి, అత్యంత సన్నిహితుల ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.  మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ ప్రమోటర్ల నుంచి మాజీ సీఎంకు రూ.508 కోట్ల ముడుపులు అందాయని ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. యాప్‌ యజమానిగా భావిస్తున్న శుభమ్‌ సోని నేరాన్ని ఒప్పుకోవడంతో బఘేల్‌ చిక్కుల్లో పడ్డారు. 
 
తనకు, బఘేల్‌కు ఉన్న సంబంధాల గురించి ఆయన వెల్లడించడమే కాక, బఘేల్‌కు వందలాది కోట్ల రూపాయలను ముడుపులుగా ఇచ్చానని అంగీకరించారు. ఆయన ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఇప్పటికే విచారణ చేపట్టింది. మరోవైపు మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై భూపేశ్‌ బఘేల్‌, ఆయన కుమారుడు చైతన్య బఘేల్‌ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ఇటీవలే దాడులు జరిపారు. 
 
భిలాయ్‌లోని ఆయన నివాసంతోపాటు చైతన్య స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇలా రాష్ట్రంలోని 14 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.30 లక్షల నగదు, పలు పత్రాలు, ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో చైతన్య బఘేల్‌కు ఈడీ అధికారులు సమన్లు కూడా జారీ చేశారు. 
 
కాగా, మద్యం కుంభకోణం ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం పాటిల్లిందని, మద్యం సిండికేట్‌కు రూ.21 వేల కోట్లకు పైగా లాభం చేకూరిందని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తున్నది. ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నది. ఇందులో భాగంగానే చైతన్య బఘేల్‌ నివాసంలో అధికారులు సోదాలు చేపట్టారు. ఇది రాజకీయ కుట్రలో భాగంగానే చేస్తున్న చర్య అని భూపేశ్ బఘేల్ ఆరోపించారు. 
 
దీనిపై స్పందిస్తూ భూపేశ్​ బఘేల్​ ఆఫీస్ ఎక్స్ వేదికగా​ పోస్ట్​ చేసింది. ‘మాజీ సీఎం భూపేశ్ బఘేల్ ఇంటికి సీబీఐ వచ్చింది. ఏప్రిల్​ 8,9 తేదీల్లో గుజరాత్​లో జరగనున్న ఏఐసీసీ మీటింగ్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన డ్రాప్టింగ్ కమిటీ సమావేశం కోసం బఘేల్ బుధవారం దిల్లీ వెళ్లాలి. కానీ, అంతకుముందే సీబీఐ ఆయన ఇంటికి వచ్చి దాడులు నిర్వహిస్తోంది’ అని పోస్ట్​లో పేర్కొంది.