
గడచిన పది సంవత్సరాల్లో తన ప్రభుత్వం మహిళల భద్రతలకు అగ్ర ప్రాధాన్యం ఇచ్చిందని, అత్యాచారం వంట దారుణ నేరాలకు మరణశిక్ష పడేలా చట్టాలను సవరించిందని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నవసారి జిల్లా వన్సీ బోర్సి గ్రామంలో భారీ జన సమూహాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, మహిళల నాయకత్వంలోని అభివృద్ధి మార్గంలో భారత్ నడుస్తోందని తెలియజేశారు.
‘ఒక బాలిక (ఇంటికి) ఆలస్యంగా తిరిగివచ్చినప్పుడు ఆమె తల్లిదండ్రులు ప్రశ్నలు అడుగుతుంటారు, కానీ ఒక బాలుడు ఆలస్యంగా వస్తే వారు అలా అడగరు. వారు అడగవలసిందే. గడచిన దశాబ్దంలో మేము మహిళల క్షేమం, భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చాం. మహిళలపై నేరాల కట్టడికి మేము నిబంధనలు, చట్టాలు మార్చాం’ అని ఆయన తెలిపారు.
‘అత్యాచారం వంటి హీనమైన నేరాలకు మరణశిక్ష విధించేందుకు నా ప్రభుత్వం చట్టాన్ని మార్చింది’ అని ప్రధాని మోదీ చెప్పారు. ‘మహిళల గౌరవానికి, సౌకర్యాలకు మా ప్రభుత్వం అత్యధిక ప్రాముఖ్యం ఇస్తోంది’ అని ఆయన చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు సాధికారత కల్పించవలసిన అగత్యం ఉందని ప్రధాని ఉద్ఘాటించారు.
‘దేశం ఆత్మ గ్రామాల్లో నివసిస్తుంటుందని (మహాత్మా) గాంధీజీ చెబుతుండేవారు. మహిళలు మన గ్రామీణ ప్రాంతాల ఆత్మ అని, గ్రామీణ భారతం ఆత్మ గ్రామీణ మహిళల సాధికారతలో నివసిస్తుంటుందని నేను దానికి జోడించాలని ఆకాంక్షిస్తున్నాను’ అని మోదీ తెలియజేశారు. ‘మా ప్రభుత్వం మహిళల కోసం పని చేస్తుంది, మేము వేలాది మరుగుదొడ్లు నిర్మించి, మహిళలకు గౌరవం ఇచ్చాం. మా ప్రభుత్వం ట్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా కఠిన చట్టాలు తీసుకువచ్చి, లక్షలాది మహిళల జీవితాలు విచ్ఛిన్నం కాకుండా వారికి రక్షణ కల్పించింది’ అని ప్రధాని తెలియజేశారు.
అమూల్, లిజ్జత్ పాపడ్ వంటి బ్రాండ్లు మహిళల సారథ్యంలోని విజయవంతమైన వ్యాపారాలకు తార్కాణాలు అని గుజరాత్లో ‘లాఖ్పతి దీదీ సమ్మేళన్’లో ప్రధాని పేర్కొన్నారు. ప్రధాని మోదీ తన ప్రసంగం ఆరంభంలో తాను ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిని అని, ఎందుకంటే తనకు కోట్లాది మంది తల్లులు, సోదరీమణుల ఆశీస్సులు ఉన్నాయని చెప్పారు.
”ఈరోజు నారీలోకానికి అంకితమైన రోజు. మహిళల నుంచి స్ఫూర్తి పొందాల్సిన రోజు. వారి నుంచి ఎంతోకొంత నేర్చుకోవాల్సిన రోజు. ఈరోజు నేను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడనని గర్వంగా చెప్పుకుంటున్నాను. కోట్లాది మంది తల్లులు, సోదరీమణులు, ఆడకూతుళ్లు నిరంతరం ఆశీస్సులు అందజేస్తున్నారు. నాకంటే సంపన్నుడు ఈ ప్రపంచంలోనే లేరు” అని మహిళల హర్షధ్వానాల మధ్య మోదీ చెప్పారు.
ఐదుగురు లఖ్పత్ దీదీలను లఖ్పతి దీదీ సర్టిఫికెట్లను మోదీ ప్రదానం చేశారు. ప్రధానమంత్రి ఈ సందర్భంగా జి-సఫల్ (జీవనోపాధిని పెంచే అంత్యోదయ కుటుంబాల కోసం గుజరాత్ పథకం), జి-మిత్ర పథకాలను ప్రారంభించారు. జి-మిత్ర పథకం కింద గ్రామీణ జీవనోపాధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి పని చేస్తున్న స్టార్టప్లకు ఆర్థక సాయం అందిస్తారు. జీ-సఫల్ పథకం కింద అంత్యోదయ కుటుంబాలకు చెందిన ఎస్హెచ్జీ మహిళలకు ఆర్థిక సాయం, వ్యవస్థాపక శిక్షణ అందిస్తారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు