జాదవ్ కిడ్నాప్‌కి సహకరించిన ముఫ్తీ షా మిర్‌ హత్య

జాదవ్ కిడ్నాప్‌కి సహకరించిన  ముఫ్తీ షా మిర్‌ హత్య
భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్‌ యాదవ్‌ను నిఘాసంస్థ ఐఎస్‌ఐ కిడ్నాప్‌ చేయడంలో సాయం చేసిన పాక్‌ మతగురువు ముఫ్తీషా-మీర్‌ హత్యకు గురయ్యాడు. బలూచిస్తాన్‌లో ఆయనను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. 

శుక్రవారం రాత్రి టర్బాట్‌లోని స్థానిక మసీదులో ప్రార్థనలు ముగించుకొని బయటకు వస్తుండగా మోటార్‌ సైకిళ్లపై వచ్చిన గుర్తుతెలియని గన్‌మెన్లు ఆయనపై పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో కాల్పులు జరిపారు. స్థానికులు వెంటనే మీర్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ముఫ్తీ షా పై గతంలోనూ రెండు సార్లు హత్యాయత్నాలు జరిగాయి.

మత సంస్థ జమియత్ ఉలేమా-ఇ-ఇస్లాం (జేయూఐ)లో ముఫ్తీ షా మీర్‌ కీలక సభ్యుడు. అక్కడి ప్రముఖ వ్యక్తుల్లో ఒకడిగా చలామణి అవుతూ ఆయుధాలు, మానవ అక్రమ రవాణా వంటి కార్యకలాపాలకు పాల్పడేవాడని అతడిపై చాలా ఆరోపణలు ఉన్నాయి.  పాకిస్థాన్‌లోని పలు ఉగ్రవాద సంస్థలతో అతడిని సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, తరచూ టెర్రర్‌ క్యాంప్‌లకు వెళ్తుంటాడని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఉగ్రవాదులు భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడడానికి సాయం చేసే వాడని మన నిఘా వర్గాలు సైతం గుర్తించాయి. 

కాగా, జేయూఐ పార్టీకి చెందిన మరో ఇద్దరు వ్యక్తులను గత వారం గుర్తు తెలియని వ్యక్తులు ఖుజ్దార్‌ ప్రాంతంలో కాల్చి చంపినట్లు తెలుస్తోంది. నావికాదళంలో విధులు నిర్వర్తించి, కొంత కాలానికి పదవీ విరమణ చేసిన కుల్‌భూషణ్‌ జాదవ్‌ ఇరాన్‌లోని చాబహార్‌లో వ్యాపారం చేస్తుండేవారు. 2016లో ఆయనను ఇరాన్‌లోని పాక్‌ ఏజెంట్లు అపహరించారు. 

కానీ బలూచిస్థాన్‌లోకి ఆయన ప్రవేశించినందు వల్లే అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. 2017 ఏప్రిల్‌లో గూఢచర్యం ఆరోపణలపై పాకిస్థాన్‌ మిలిటరీ కోర్టు కుల్‌భూషణ్‌ జాదవ్‌కు మరణశిక్ష విధించింది. ఈ అంశంపై భారత్‌ చాలా తీవ్రంగా స్పందించింది. ఇరాన్‌లో ఉంటున్న జాదవ్‌ను పాక్‌ అక్రమంగా అపహరించిందని ఆరోపించింది. ఆ మరణశిక్షను సవాల్​ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ కేసు విచారణ ఇప్పటికీ కొనసాగుతోంది.