
* ఎగుమతిదారుల ప్రయోజనాలు కాపాడతాం
జీఎస్టీ, ఇతర ట్యాక్సులు విధిస్తున్నామంటే, దానికి కారణముందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ఏ సదుపాయమూ ఊరకనే రాదని ప్రజలు గ్రహించాలని ఆమె కోరారు. విశాఖపట్నం నోవాటెల్లో గురువారం వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు, చార్టెడ్ అకౌంటెంట్లతో ఆమె సమావేశం అయ్యారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత దానిని పార్లమెంటులో చర్చకు పెట్టి ఆమోదించే ముందుగా వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని నిర్మల తెలిపారు. ‘‘బడ్జెట్ సూచనల కోసం తొలుత ముంబైలో సమావేశం నిర్వహించాం. ఇప్పుడు విశాఖలో రెండో సమావేశం ఏర్పాటు చేశాం’’ పేర్కొన్నారు.
ఒక కారును రూ.12 లక్షలు పెట్టి కొంటే జీఎస్టీ, రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ ట్యాక్స్…ఇలా సుమారు మరో రూ.10 లక్షలు అదనంగా పన్నుల రూపంలో చెల్లించాల్సి వస్తోందని, ఇది న్యాయమా?…అని ఒకరు ప్రశ్నించగా మంత్రి సవివరంగా సమాధానమిచ్చారు.
‘‘సాధారణ పౌరుల దృష్టిలో ఇది పన్నుల భారంగానే కనిపిస్తుంది. కానీ అవన్నీ వేర్వేరు అవసరాల కోసం చెల్లిస్తున్నారు. తయారు చేసిన కారు కొన్నందుకు జీఎ్సటీ కడతారు. రహదారిపై ఆ వాహనం నడుపుతున్నందుకు ఆ రోడ్డు నిర్మాణానికి అయిన ఖర్చు కోసం పన్ను కట్టాల్సి ఉంటుంది. పెట్రోల్ పోయించుకుంటే, దానిని దిగుమతి చేసుకున్నందుకు పన్ను చెల్లించాలి” అని ఆమె వివరించారు.
“ఇలా అన్ని వేర్వేరు ప్రయోజనాల కోసం చెల్లించాల్సి ఉంటుంది. దేశంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారు తొమ్మిది కోట్ల మంది ఉంటే…వారిలో కేవలం మూడు కోట్ల మంది మాత్రమే పన్ను చెల్లింపుదారులు ఉన్నారు’’ అని మంత్రి తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని మత్స్యపురి గ్రామానికి చాలాకాలం క్రితం వరకు తాగునీరు ఉండేది కాదని, ఇప్పుడు ఆ గ్రామం సహా దేశంలోని ప్రతి ఇంటికీ జల జీవన్ మిషన్ ద్వారా నీటి కొళాయి ఇస్తున్నామని ఆమె చెప్పారు. విశాఖపట్నం స్టీల్ప్లాంటుకు ఉన్న రుణాలను చాలావరకు చెల్లించడం వల్ల బ్యాంకులు ఇప్పుడు ఆర్థిక సాయం అందించడానికి చర్యలు చేపడుతున్నాయని ఆమె తెలిపారు.
కాగా, పోలవరం జాతీయ ప్రాజెక్టు అని, దానిని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని నిర్మల స్పష్టం చేశారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు డీపీఆర్ సమర్పిస్తే దానికీ నిధులిస్తామని ఆమె హామీ ఇచ్చారు.
More Stories
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
‘మోహన్లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు