
‘హిందూ’ అనే పదాన్ని బహిరంగంగా వాడటం చాలా సవాల్గా మారి, మదన్ మోహన్ మాలవ్య కూడా ‘హిందూ’ అనే పదాన్ని వివిధ ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉపయోగించాల్సి వస్తున్న రోజుల్లో “ఇది హిందూ రాష్ట్రమే” అని ధైర్యంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ద్వితీయ సర్ సంఘచాలక్ ఎం ఎస్ గోల్వల్కర్ ప్రకటించారని ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు.
నవయుగ భారతి ఆధ్వర్యంలో ‘‘శ్రీ గురూజీ దృష్టి- దార్శనికత’’ అన్న పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ గురూజీగా పేర్కొండిన గోల్వాల్కర్ 34 ఏళ్ళ వయస్సులోనే సర్ సంఘచాలక్ గా బాధ్యతలు స్వీకరించారని, ఆ సమయంలో దేశం విదేశీయుల పాలనలో వుండేదని, సంఘానికి కూడా అనుకూల సమయం కాదని, అప్పటి రాజకీయాల్లో హిందూ అన్న శబ్దం అంత ప్రాచుర్యంలో వుండేది కాదని గుర్తు చేశారు.
ముస్లింలు ఉర్దూ సాహిత్యం, వ్యాసాలు రాసే సమయంలోనూ మన దేశాన్ని హిందుస్థాన్ అనే సంబోధించేవారని, కానీ కొన్ని రోజుల తర్వాత రాజకీయ స్వరూపం మారిపోయిందని, హిందు ముస్లిం సంబంధం విషయంలో గంగా జమునా అంటూ కావాలని ప్రచారం ప్రారంభించారని చెప్పారు. ఆ తర్వాత సోషలిస్టు అన్న పదం కూడా బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందని పేర్కొంటూ ఇలాంటి పదబంధం వాడటం ఓ ఫ్యాషన్ అయిపోయిందని తెలిపారు.అప్పుడే హిందూ అన్న శబ్ద ప్రవాహం కూడా విరివిగా ప్రారంభమైందని వివరించారు.
అప్పటి రాజకీయాలు, పరిస్థితులు అన్నీ డాక్టర్జీ లోతుగా అధ్యయనం చేసి “ఇది హిందూ రాష్ట్రం.. నేను చెబుతున్నాను కదా’’ అని డాక్టర్జీ ప్రకటించారని అంబేకర్ తెలిపారు. ప్రారంభం నుంచే ఈ భావనను తీసుకొనే సంఘ్ ప్రయాణం ప్రారంభమైందని, దీనికి సమాంతరంగా హిందుత్వం కోసం పనిచేసే వ్యక్తులను వెతకడం కూడా డాక్టర్జీ ప్రారంభించారని, అలాగే సంఘ్ ని నడిపించేవారని చెప్పారు.
సమాజానికి మార్గదర్శనం చేసే వారు, సంఘ విచార ధారను అర్థం చేసుకునేవారు, స్వయంసేవకులను తయారు చేసేవారని, దేశంలో నడుస్తున్న చర్చకి సరైన దిశ ఇచ్చే వారి కోసం డాక్టర్జీ నిరంతరం వెతకడం ప్రారంభించారని తెలిపారు. ఈ సమయంలోనే కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో విద్యా బోధన చేస్తున్న డాక్టర్జీకి మాధవ రావు సదాశివరావు గోళ్వాల్కర్ తటస్థించారని పేర్కొన్నారు.
గురూజీ జీవనం మొత్తం అందరికీ సదా ప్రేరణాదాయకమే గాక అత్యంత ప్రభావవంతమైన జీవితం కూడా అని, పైగా సన్యాస జీవితం, బుద్ధి అత్యంత ప్రగాఢమైందని, జ్ఞాపక శక్తి కూడా అమోఘమైందని, వ్యక్తిత్వం కూడా అద్భుతమైందని, వర్ణనాతీతం అని వివరించారు. ఒక్క మాటలో ఆయన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించాలనుకుంటే దేశ కార్యంలో తనని తాను సమర్పితం చేసేంత వ్యక్తిత్వం ఆయనదని అంబేకర్ వివరించారు.
దేశ విభజనకు ముందు గురూజీ కరాచీలో వున్నారని, జరుగుతున్న సంఘటనలన్నింటినీ ఓ వ్యూహకర్తలా ఓ కంట కనిపెడుతూనే వున్నారని, 1962 నాటికి రాబోయే ప్రమాదాలను ఆయన ముందుగానే ఊహించారని పేర్కొంటూ ఆయన ఆంతర దృష్టి ఇప్పటి సంఘటనలకూ సరిపోయేంత తీక్షణమైనదని తెలిపారు.
భారత్ లో మాట్లాడే ప్రతి భాషా జాతీయ భాషే అని గురూజీ విశ్వసించారని అంబేకర్ చెప్పారు. రాజ్యాంగ విషయాలు, జాతీయ విధానాలు, పాలనపై అత్యంత వివరణాత్మక మార్గదర్శనం అందించారుని చెబుతూ ఆయన ఆలోచనలు ఆ కాలానికి సంబంధించినవి కానీ… చాలా వరకు ఆ ఆలోచనలు కాలాతీతమైనవే, మనకు ఆలోచనలను రేకెత్తించేవే అని స్పష్టం చేశారు.
గురూజీకి సంబంధించి ముఖ్యమైన ఆందోళనలో చైనా ఒకటి అని చెబుతూ చైనా విషయంలో గురూజీ పదే పదే హెచ్చరించేవారని ఆయన తెలిపారు. దాని దురాక్రమణ కేవల ప్రాదేశికమైనదే కాదని చెప్పేవారని, భారత్ పట్ల దాని సైద్ధాంతిక వైఖరి లోతుగా పాతుకుపోయేదని కూడా చెప్పేవారని గుర్తు చేశారు. కేవలం విస్తరణవాద శక్తి మాత్రమే కాదని, భారత్ కి సైద్ధాంతిక ముప్పు అని చెప్పేవారని తెలిపారు.
అయితే ఈ ఆలోచనలు రాత్రికి రాత్రే రాలేదని, లోతైన అవగాహన, దార్శనికతతో సాధ్యమైందని అంబేకర్ చెప్పారు. జాతీయ భద్రత విషయంలో ఆయనకున్న స్పష్టమైన వైఖరి అచంచలమైనదని పేర్కొంటూ క్లిష్ట సమయాల్లో ప్రభుత్వంతో కలిసి నిలబడాలని, సాయుధ దళాలకు మద్దతివ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారని తెలిపారు.
విభజన విషయంలో గురూజీ ఎప్పుడూ రాజీపడలేదని స్పష్టం చేశారు. దేశానికి ఏది మంచిదో జమ్మూ కశ్మీర్ మహారాజాకు వివరించేవారని, భారత సమగ్రతకే గురూజీ అత్యంత ప్రాధాన్యతనిచ్చేవారని చెప్పారు. ఆయన అభిప్రాయాలు ఎప్పుడూ మనకు మార్గదర్శకాలే అని అంబేకర్ స్పష్టం చేశారు.
విశ్వహిందూ పరిషత్ స్థాపించిన సమయంలో హిందూ ఏకతా కోసం పిలుపునిచ్చారని, ఆయన అయోధ్య అంశాన్ని హిందువుల ఐక్యతకు సూచికగా భావించారని పేర్కొంటూ ధర్మ మార్పిడులు దేశ విభజనకు దారితీస్తాయని హెచ్చరించారని తెలిపారు. “మీరు ఆరాధనా విధానాన్ని మార్చుకోవచ్చు, కానీ మీ జాతీయతను మార్చలేరు” అని ఆయన స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు.
శ్రీ గురూజీ తత్వశాస్త్రం నేటికీ ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉందని చెబుతూ ఆయన మార్గదర్శనం ఆర్ఎస్ఎస్ సిద్ధాంత చట్రాన్ని నిర్మించడంలో కీలకమైనదని తెలిపారు. ఈ గ్రంథం ఆయన ఆలోచనలను సమర్థంగా అర్థం చేసుకోవడానికి మార్గదర్శిగా నిలుస్తుందని సునీల్ అంబేకర్ పేర్కొన్నారు.
విశిష్ట అతిథిగా హాజరైన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య వెలుదండ నిత్యానందరావు “ఇలాంటి లోతైన ఆలోచనలు భాషా పరిమితులను దాటి అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఈ గ్రంథం పరిశోధకులకు, యువతకు, శ్రీ గురూజీ అభిప్రాయాలను అర్థం చేసుకునే గొప్ప మార్గదర్శకంగా నిలుస్తుంది” అని తెలిపారు.
నవయుగ భారతి కార్యదర్శి నేతి క్షీరసాగర్ అధ్యక్షత వహించగా, ఆర్ఎస్ఎస్ ప్రాంత సంచాలకులు సుందర్ రెడ్డి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. ఈ పుస్తకాన్ని జ్యేష్ఠ ప్రచారకులు రాంపల్లి మల్లికార్జున రావు పరిచయం చేయగా, తెలుగులోకి అనువాదం చేసిన సీనియర్ పాత్రికేయులు వేదుల నరసింహం కూడా ప్రసంగించారు.
More Stories
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్లో చీలిక!
భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ పోలీస్
గిరిజనుల కోసం డిజిటల్ వేదిక “ఆది సంస్కృతి” బీటా వెర్షన్