అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై చైనా15 శాతం టారిఫ్‌

అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై చైనా15 శాతం టారిఫ్‌

ట్రంప్ టారిఫ్​ వార్ ప్రారంభించిన నేపథ్యంలో అమెరికాకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులపై 15 శాతం అదనపు టారిఫ్‌లు విధిస్తామని చైనా ప్రకటించింది. ముఖ్యంగా అమెరికా నుంచి తమ దేశంలోకి దిగుమతి అయ్యే చికెన్‌, గోధుమ, పత్తి, కార్న్‌పై అదనంగా 15 శాతం సుంకాలు విధిస్తామని చైనా వాణిజ్య శాఖ తెలిపింది. 
 
సోయా, పోర్క్, బీఫ్‌, సముద్ర ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, డైరీ ఉత్పత్తులపై ప్రస్తుతమున్న సుంకాలను 10 శాతం మేర పెంచుతామని పేర్కొంది. 
నూతన సుంకాలు మార్చి 10 నుంచి అమల్లోకి వస్తాయని చైనా వాణిజ్య శాఖ వెల్లడించింది. అంతేకాదు అమెరికాకు చెందిన 10 రక్షణ రంగ సంస్థలను డ్రాగన్ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. 
 
ఫలితంగా అమెరికా సంస్థలు చైనాలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉండదని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఆ సంస్థలకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటవ్‌లు కూడా చైనాలోకి ప్రవేశించేందుకు అవకాశం ఉండదని తెలిపింది.
ఇప్పటికే చైనా ఉత్పత్తులపై 10 శాతం సుంకాలు విధించగా, తాజాగా దాన్ని 20 శాతానికి పెంచుతూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. ఫెంటనిల్‌ డ్రగ్స్‌ అక్రమ రవాణాను అడ్డుకోవడంలో బీజింగ్‌ విఫలమవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్​ తెలిపారు. 
 
మరోవైపు కెనడా, మెక్సికో దిగుమతులపై 25% సుంకాల విషయంలో ఎలాంటి మార్పు లేదని డొనాల్డ్​ ట్రంప్‌ స్పష్టం చేశారు.  కెనడా నుంచి దిగుమతి చేసుకునే పలు ఉత్పత్తులపై 25శాతం, చమురు, సహజవాయువు, విద్యుత్తుపై మాత్రం 10% సుంకం విధిస్తున్నట్లు ట్రంప్‌ తెలిపారు. దీనికి ప్రతిగా ట్రూడో కూడా  అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆల్కహాల్, పండ్లు సహా 107 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై తాము కూడా 25% సుంకం విధిస్తున్నట్లు వెల్లడించారు. ఇవి కూడా మంగళవారం నుంచే అమల్లోకి వస్తున్నట్లు తెలిపారు.
ట్రంప్‌ టారిఫ్​ల దెబ్బకు అమెరికా మార్కెట్లు కుదలేయ్యాయి. సోమవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు పతనమయ్యాయి. డోజోన్స్‌ 1.48శాతం, ఎస్‌అండ్‌పీ సూచీ 1.76శాతం, నాస్‌డాక్‌ 2.64శాతం మేర నష్టపోయాయి. ఈ ప్రభావం ఆసియా-పసిఫిక్‌, ఆస్ట్రేలియా మార్కెట్లపైనా పడింది.