ఉత్తరాఖండ్‌లో మంచు ప్రళయం ..16 మంది గల్లంతు?

ఉత్తరాఖండ్‌లో మంచు ప్రళయం ..16 మంది గల్లంతు?
 
ఉత్తరాఖండ్‌లో మంచు చరియలు బీభత్సం సృష్టించాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న హిమపాతం సరిహద్దు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నది. ఈ క్రమంలో చమేలి జిల్లాలోని మన అనే సరిహద్దు గ్రామంలో చమోలి-బద్రీనాథ్‌ రహదారిపై ఏర్పాటు చేసిన శిబిరంపై పెద్దయెత్తున మంచు చరియలు విరుచుకు పడటంతో అక్కడ పనిచేస్తున్న 57 మంది బోర్డర్‌ రోడ్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌వో) కార్మికులు చిక్కుకుపోయారు. 
 
శుక్రవారం ఉదయం 7.15 గంటలకు ఇది చోటుచేసుకోగా, ఆ సమయానికి కార్మికులు ఎనిమిది కంటైనర్లు, ఒక షెడ్‌లో ఉన్నారు. దీంతో అధికారులు అప్రమత్తమై వారిని బయటకు తీసేందుకు సహాయ కార్యక్రమాలు చేపట్టారు.  అధికారుల కథనం ప్రకారం శుక్రవారం 32 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చి, గ్రామంలో ఏర్పాటు చేసిన ఐటీబీపీ శిబిరంలో చికిత్స అందిస్తున్నారు. వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 
 
ప్రతికూల వాతావరణం, భారీ హిమపాతం ఏర్పడే ప్రమాదం ఉండటంతో సహాయ కార్యక్రమాలు తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో మిగిలిన 11 మంది కార్మికుల గురించి ఆందోళన వ్యక్తమవుతున్నది. బద్రీనాథ్‌లో జరిగిన ప్రమాదంలో మంచు చరియల కింద చిక్కుకున్న వారినందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు.
 
కార్మికులను రక్షించేందుకు పలు బృందాలు ఆ సంక్లిష్ట ప్రాంతం, భారీ మంచు, వర్షం మధ్యలో తీవ్రంగా శ్రమించారని చమోలి జిల్లా మేజిస్ట్రేట్ సందీప్ తివారి తెలియజేశారు. అయితే, ఈ దుర్ఘటనలో మరణాల గురించి వెంటనే ఎటువంటి సమాచారమూ రాలేదని ఆయన తెలిపారు.  ‘ఆ కార్మికులు టిబెట్ సరిహద్దు వైపు సైన్యం రాకపోకల కోసం దారిలో ఎప్పటికప్పుడు మంచును తొలగిస్తుంటారు.  ప్రస్తుతం మాకు ఏవైనా మరణాలు సంభవించాయా అన్న సమాచారం ఏదీ అందలేదు’ అని చెప్పారు. 
 
“రక్షక బృందాలను సమీకరించాం. కానీ ఆ ప్రాంతంలో దట్టంగా మంచు, వర్షం కురుస్తున్నందున రక్షణ, సహాయ కార్యక్రమాలు మందగించాయి” అని ఆయన వివరించారు. మంచు, వర్షం కురుస్తున్నా రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్ నుంచి దాదాపు 300 కిమీ దూరంలోని ఆ ప్రదేశానికి జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్), ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు బయలుదేరి వెళ్లాయి. 
 
‘మంచుచరియలు విరిగిపడినప్పుడు చిక్కుకుపోయిన 57 మంది బిఆర్‌ఒ కార్మికుల్లో 16 మందిని రక్షించడమైంది. తక్కినవారిని రక్షించేందుకు కృషి సాగుతోంది. రక్షణ, సహాయ కార్యక్రమాల్లో ఐటిబిపి, ఇతర విభాగాల సాయం తీసుకుంటున్నారు. మా విపత్తు స్పందన శాఖ, పూర్తి పాలన యంత్రాంగం అప్రమత్తంగా ఉంది’ అని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి చెప్పారు.