సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఇక ఏటా రెండుసార్లు

సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఇక ఏటా రెండుసార్లు

కేంద్రం నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో పలు కీలక మార్పులకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా 2026 నుంచి సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలను ఏడాదిలో 2 సార్లు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు ముసాయిదా నిబంధనలతో సీబీఎస్‌ఈ ఓ పబ్లిక్‌ నోటీస్‌ను తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. 

ఫిబ్రవరి – మార్చిలో మొదటి విడత పరీక్షలు; మే నెలలో రెండో విడత పరీక్షలు నిర్వహించనున్నట్లు అందులో స్పష్టం చేసింది. ఈ రెండు పరీక్షలూ పూర్తిస్థాయి సిలబస్‌తోనే నిర్వహిస్తామని సీబీఎస్‌ఈ ముసాయిదాలో స్పష్టంగా పేర్కొంది. సీబీఎస్​ఈ బోర్డు పరీక్షలు ఏడాదిలో రెండుసార్లు నిర్వహించినప్పటికీ, ప్రాక్టికల్స్‌/ అంతర్గత మూల్యాంకనం మాత్రం ఒకేసారి చేయనున్నట్లు తెలిపింది. 

ఈ తరహా విధానం విద్యార్థులు తమ నైపుణ్యాలను మరింతగా మెరుగుపరుచుకునే అవకాశం కల్పిస్తుందని తెలిపింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ అంశాలపై చర్చించినట్లు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో సీబీఎస్​ఈ వెల్లడించింది. 

విస్తృతమైన చర్చల అనంతరం రూపొందించిన ఈ ముసాయిదాను తమ వెబ్‌సైట్‌లో చూడవచ్చని తెలిపింది. ఈ ముసాయిదా విధానంపై విద్యార్థులు, తల్లిదండ్రులు మార్చి 9లోగా తమ అభిప్రాయాలను చెప్పవచ్చని బోర్డు సూచించింది. ఈ విధంగా తమకు వచ్చిన స్పందనలను పరిశీలించిన తర్వాత, ఈ ముసాయిదాను సమీక్షించి, సవరిస్తామని, తరువాత తుది రూపం ఇచ్చి ఖరారు చేయనున్నట్లు సీబీఎస్‌ఈ పరీక్షల కంట్రోలర్‌ డాక్టర్‌ సన్యమ్‌ భరద్వాజ్‌ తెలిపారు. 

ఈ ముసాయిదా ప్రకారం, 2026 నుంచి సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి మార్చి 6 వరకు మొదటి విడత, మే 5 నుంచి 20 వరకు రెండో విడత పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో పాటు ముసాయిదా డేట్‌ షీట్స్‌ను సైతం విడుదల చేసింది సీబీఎస్​ఈ. 2026 ఫిబ్రవరిలో పరీక్షలు రాసే విద్యార్థుల జాబితాను 2025 సెప్టెంబరు నాటికే తయారు చేస్తారు. ఈ జాబితాలో పేరు ఉన్నవారికి మాత్రమే 2026 మేలో జరిగే పరీక్షలకు అనుమతి ఇస్తారు. ఒక్కసారి జాబితాను ఖరారు చేసిన తరువాత సబ్జెక్టులను మార్చుకునే అవకాశం విద్యార్థులకు ఉండదు.